Cyberabad Police: రోడ్డుపై మనం చేసే ఒక చిన్న అజాగ్రత్త ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది. నిత్యం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాహనదారులు నిర్లక్ష్యాన్ని వీడి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ డీసీపీ-I రంజన్ రతన్ కుమార్ సూచించారు. అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్రూట్ ప్రయాణం, మరియు డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వాడటం వంటి కారణాల వల్లే అత్యధికంగా ప్రాణనష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డు నిబంధనలు అనేవి కేవలం పోలీసులు వేసే జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, అవి మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచాలని డీసీపీ స్పష్టం చేశారు. “కొద్ది దూరమే కదా” అనే నిర్లక్ష్యంతో హెల్మెట్ ధరించకపోవడం లేదా రాంగ్రూట్లో వెళ్లడం వంటివి ప్రాణాంతకమవుతాయని ఆయన హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు మాత్రమే కాకుండా, వెనుక కూర్చునే పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు మరియు భారీ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన ఆదేశించారు.
ప్రమాదాల నివారణలో లేన్ క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు వేగ పరిమితిని మించకుండా, లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి సరైన పత్రాలతో ప్రయాణించాలని సూచించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పాదచారులు కూడా రోడ్డు దాటే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్ మాత్రమే కాకుండా, అమాయకులైన ఇతరుల ప్రాణాలు కూడా ముప్పులో పడతాయని పోలీస్ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్డుపై కొన్ని క్షణాల అజాగ్రత్త మీ కుటుంబంతో పాటు మరొక కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేస్తుందని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read Also: Sircilla: సిరిసిల్లలో పొలిటికల్ బాంబు.. ‘క్షమించు రామన్న.. కారుకు ఓటు వేయలేం’ అంటూ కరపత్రం వైరల్