Telangana : తండ్రి చనిపోయాడు. కొడుకు తలకొరివి పెట్టనన్నాడు. ఆస్తి పంచలేదని అలిగాడు. కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే కొరివి పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. అలా ఆ కుటుంబ గొడవ వీధిన పడింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకున్నారు. కొడుక్కి నచ్చజెప్పారు. అయినా, వినిపించుకోలేదు ఆ కన్న కొడుకు. చివరికి చేసేది లేక.. చిన్న కూతురు తాను తండ్రికి తలకొరువు పెడతానంటూ ముందుకొచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆ కొడుకు మనిషినా? ఆస్తి కోసం తండ్రికి కొరివి పెట్టడా? అంటూ స్థానికులు అసహ్యించుకుంటున్నారు. కూతురే కొడుకుగా మారి తలకొరివి పెట్టిన తీరును అభినందిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో జరిగిందీ ఘటన. ఇంతకీ అసలేం జరిగిందంటే…
ఇంటి కోసం గొడవ..
తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమీ అంటారు. అలాంటి ఓ కర్కోటక కొడుకు కథే ఇది. కన్న తండ్రిపై మమకారం కన్నా.. తనకు ఆయన ఇల్లు ఇవ్వలేదన్న ద్వేషమే అధికమైంది ఆ పుత్ర రత్నానికి. నారాయణపేట జిల్లా, క్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. అందరి పెళ్లిళ్లు చేశారు. భార్య గతంలోనే మరణించడంతో.. ఆయన ఒంటరిగా మిగిలారు. తన బిడ్డల ఇంటి పట్టునే ఉంటూ వచ్చారు. పెద్ద కుమార్తె ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో.. ఆమె పేరిట ఊళ్లోని సొంతిల్లు రాసిచ్చారు. సోదరికి అలా ఇల్లు ఇచ్చేయడం కొడుక్కి నచ్చలేదు.
తండ్రి చావుతో కొడుకు పంతం
వయస్సు మీదపడటంతో మాణిక్యరావు మంగళవారం రాత్రి చనిపోయారు. హైదరాబాద్లో ఉన్న కొడుకు గిరీష్కి తండ్రి మరణవార్త తెలిసింది. ఇంటిని తనకు కాకుండా తన సోదరికి రాయడంతో.. తాను రావడం కుదరదని తెగేసి చెప్పాడా సుపుత్రుడు. అలాగని కొడుక్కి ఆస్తులేమీ ఇవ్వలేదని కాదు. 60 లక్షల విలువ చేసే 15 ఎకరాల పొలం రాసిచ్చాడా తండ్రి. అది సరిపోదని.. కోటి రూపాయల విలువైన ఇల్లు కూడా తనకే కావాలనేది ఆ కొడుకు డిమాండ్. అది దక్కలేదని తండ్రిపై పీకలదాకా ద్వేషాన్ని పెంచుకున్నాడు. తండ్రి చనిపోతే కూడా రానంటే రానంటూ పంతం పట్టాడు.
తండ్రికి కొరివి పెట్టిన కూతురు
విషయం తెలిసి.. ఇంటిని ముగ్గురం సమానంగా పంచుకుందామంటూ బ్రదర్కు ఆఫర్ ఇచ్చారు ఆ అక్కాచెల్లిలు. ఇల్లు మొత్తం తనకు ఇస్తేనే వస్తానని.. ఇప్పటికిప్పుడు పత్రాలు రాసిస్తేనే తలకొరివి పెడతానని ఆ గిరీష్ బ్లాక్మెయిల్ చేశాడు. బంధుమిత్రులు ఎంత చెప్పినా ఆ కొడుకు వినలేదు. అతని గుండె కరగలేదు. స్థానిక పెద్దలు కలుగజేసుకుని.. మీరు అంత్యక్రియలు చేయకపోతే తామే ఆ కార్యం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇక చేసేది లేక.. కొడుక రాక.. చిన్న కూతురే తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకొచ్చారు. తండ్రి అంతిమయాత్రలో ముందున్నారు. కొడుకులా.. కూతురే తలకొరివి పెట్టారు.
Also Read : ఆ బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారా?
వాడు కొడుకా? కిరాతకుడా?
కొడుకు గిరీష్ తీరుపై సర్వత్రా విమర్శలు, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆస్తి కోసం ఇంత పని చేస్తాడా? తండ్రికి తలకొరివి కూడా పెట్టడా? అసలు వాడు కొడుకేనా? కూతుళ్లే నయం అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.