Ganja Seizure: స్వేచ్ఛ బ్యూరో: ఈగల్ ఫోర్స్ మరో ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేసింది. పక్కాగా సేకరించిన సమారారంతో ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 113 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను ఈగల్ ఫోర్స్ అధికారులు ఖమ్మం పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా దుపలవాడ గ్రామం నుంచి కొందరు గంజాయి కొని మహారాష్ట్ర ఉస్మానాబాద్ కు తరలిస్తున్నట్టుగా ఈగల్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ అధికారులు ఖమ్మం పోలీసులతో కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు. గంజాయి తీసుకొస్తున్న వాహనాల వివరాలు సేకరించి వాటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఖమ్మం బైపాస్ రోడ్డులోని విజన్ జూనియర్ కాలేజీ వద్ద గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా కారుతోపాటు ఎస్కార్టుగా వచ్చిన మరో కారును అడ్డగించారు. తనిఖీలు చేయగా మారుతీ ఎర్టిగా కారులో 57లక్షల రూపాయల విలువ చేసే గంజాయి దొరికింది. ఈ క్రమంలో ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన మోహన్ భీంరావ్ జాదవ్ (36), గోపీనాథ్ దిగంబర్ సుక్లే (55), రవి జాదవ్ (28), సంతోష్ తయ్యప్ప జాదవ్ (40)లను అరెస్ట్ చేశారు.
Also Read: మరోసారి అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ కపుల్..
నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితులకు గంజాయి సప్లయ్ చేసిన దుపలవాడ గ్రామ నివాసి బసు అలియాస్ రాజు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకాలు, వినియోగం గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే 1908 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు. 87126 71111 నెంబర్ కు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు. https://eagleforce.tspolice.gov.in/ కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Also Read: Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!