Hyderabad Formula E Race: బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఫార్ములా ఈ రేస్ వ్యవహారం కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? మాజీ మంత్రి అరెస్ట్ రంగం సిద్ధమవుతోందా? నిధులు విదేశీ కంపెనీకి ఇవ్వడంతో ఈడీ రంగంలోకి దిగుతుందా?
కేటీఆర్ ఎందుకు కంగారు పడుతున్నారా? నాటు బాంబు, లక్ష్మీబాంబు కాదని, ఈసారి ఆటమ్ బాంబు పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్టేట్మెంట్ వెనుక ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి.
ఏసీబీ అరెస్ట్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో గురువారం మీడియా ముందుకు వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఆయన చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. అరెస్ట్ చేస్తారా చేసుకోండి.. జైలులో రెస్ట్ తీసుకుని ఫిట్నెస్తో పాదయాత్ర మొదలు పెడతానని చెప్పకనే చెప్పేశారు. ఈ లెక్కన కేటీఆర్కు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నమాట.
పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేస్తామని ప్రత్యర్థులను కేటీఆర్ భయపెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోందని రాజకీయ నిపుణుల మాట. రెండు దశాబ్దాల కిందట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫార్ములా రేస్ని హైదరాబాద్కు తీసుకురావాలని ప్లాన్ చేశారని, దాన్ని మేము చేసి నిరూపించామని చెప్పుకొచ్చారు కేటీఆర్.
ALSO READ: కేటీఆర్ ఉలిక్కిపాటు.. ఇంట్రెస్టింగ్గా ఫార్ములా ఈ – రేస్ కేసు.. వాట్ నెక్స్ట్?
పనిలో పనిగా పొరుగు రాష్ట్రం సీఎంని పేరు ప్రస్తావించారు. ఆ విధంగానైనా ఉపశమనం కలుగుతోందని కేటీఆర్ పాచిక వేశారన్నది కొందరి నేతల మాట. ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు ఏ పని చేసినా ప్రతీ పనికీ రాతలు ఉంటాయి.
కేబినెట్లో చర్చించకుండా జీవో రిలీజ్ చేయకుండా నిధులు ఎలా ఇచ్చారన్నది ఫస్ట్ ప్రశ్న. కేవలం నోటి మాటతో ఖర్చు చేస్తే అది ప్రభుత్వ నిర్ణయం ఎలా అవుతుంది? ఫార్ములా ఈ -గ్రీన్ కో -హెచ్ఎండీఏ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందన్నది కేటీఆర్ మాట.
కానీ, గ్రీన్ కో తప్పుకున్న తర్వాత మళ్లీ ఒప్పందానికి ఎంవోయూ కుదిరినట్లు ఎక్కడా చెప్పలేదాయన. అంటే ఎంవోయూ లేకుండా హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేస్కి కోట్లాది రూపాయలు ఇచ్చామని ఓపెన్గా క్లారిటీ ఇచ్చేశారు.
మరో విషయం ఏంటంటే.. విదేశీ సంస్థకు ఇచ్చిన మనీలో 23 కోట్లు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఇచ్చారన్నది ప్రభుత్వ వర్గాల మాట. అంటే ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా చెల్లింపులు జరిపారన్న మాట. తన ఆదేశాలతో ఫార్ములా ఈ రేస్కి డబ్బులు ఇచ్చామని తెలిపారు.
జీవో లేకుండా కేవలం ఆదేశాలతో ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం నుంచి డబ్బు బదలాయించడం నిబంధనలకు ముమ్మాటికీ విరుద్ధమని కొందరు ప్రశ్న. విదేశీ సంస్థలకు నిధులు ఇవ్వడంపై ఈడీ కూడా దృష్టి సారించినట్టు ప్రభుత్వ వర్గాల మాట. రేపో మాపో ఈడీ కూడా దిగే ఛాన్స్ వుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి నాటు బాంబు, లక్ష్మీబాంబు కాదని, ఆటమ్ బాంబు పేలుతుందని చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.