Fish Seed: రాష్ట్రంలో మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్న ‘ఎల్నినో’ వాతావరణ ప్రభావం, ఇప్పుడు చేపపిల్లల ఉచిత పంపిణీ పథకంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు సగం చెరువులు, కుంటలు నీరు లేక ఎండిపోయి వెలవెలబోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఏటా నిర్వహించే రూ.116 కోట్ల అంచనా వ్యయంతో కూడిన సుమారు 80కోట్ల చేపపిల్లల పంపిణీ పథకం ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఇప్పటికే జిల్లాల వారీగా టెండర్లు వేసి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగాచర్చనీయాంశమైంది.
గతేడాది రాష్ట్రంలో 30,304 చెరువుల్లో చేపపిల్లల పంపిణీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 13353 చెరువుల్లో నీరు ఉండటంతో చేపపిల్లలను ఆ చెరువుల్లో మాత్రమే విడుదల చేశారు. ఈ సారి సైతం గతేడాది చెరువులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ తో చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాలు ఉత్తర తెలంగాణకు ఊరట ఇచ్చినప్పటికీ దక్షిణ తెలంగాణకు మాత్రం ఆశించిన వర్షాలు పడలేదు. గతంలో నీటి మట్టాలతో సంబంధం లేకుండా జాబితాలో ఉన్న అన్ని చెరువుల్లోనూ చేపపిల్లలను వదిలేసేవారు. కానీ ఈసారి ఎల్నినో దెబ్బకు 50 శాతానికి పైగా జలాశయాలు, చెరువులు అడుగంటిపోయాయి. నీటి చుక్క లేని చెరువుల్లో చేపపిల్లలను ఎలా విడుదలకు కేటాయిస్తారన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చకుదారితీసింది.
ప్రభుత్వం చేపపిల్లల పంపిణీకి టెండర్లను ఆహ్వానించింది. టెండర్ ప్రక్రియ ముగిసింది. 32 జిల్లాలకు సుమారు 140పైగా కాంట్రాక్టర్లు టెండర్ వేసినట్లు సమాచారం. తాము కోట్ చేసిన మొత్తం పరిమాణానికి కాంట్రాక్టు దక్కుతుందా లేదా అనేది కాంట్రాక్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు శాతం చెరువు, జలాశయాల్లో మాత్రమే నీరు ఉండటంతో నీరు ఉన్న చెరువులకే చేపపిల్లల పంపిణీ బాధ్యత అప్పగిస్తారా? లేదా? అనేది కూడా చర్చకు కారణమైంది. మరోవైపు కాంట్రాక్టర్లకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు అవుతుందా? గతంలో అయితే జిల్లాల్లోని అన్ని చెరువుల్లో నీరు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు సగం చెరువుల్లో మాత్రమే నీరు ఉండటంతో ప్రభుత్వం ఎలా టెండర్ బాధ్యతలను అప్పగిస్తుందనదా చూడాలి.
Also read: ఇద్దరు చెరోదిక్కు దోచుకున్నారు.. మళ్లీ దోచుకునేందుకు అధికారం కోసం చూస్తున్నారు..!
వర్షాకాలం అదును దాటిపోతుండటంతో, నీరు ఉన్న చెరువులకైనా త్వరగా చేప పిల్లలను సరఫరా చేయకపోతే ఎదుగుదల తగ్గి నష్టపోతామని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎండిపోయిన చెరువుల్లో సైతం చేపలు వేసినట్లు కాగితాల్లో చూపించి కోట్లాది రూపాయల నిధులు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈసారి అలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. డబ్బాల పరిమాణాన్ని బట్టి కాకుండా వేయింగ్ బ్రిడ్జిల వద్ద వాహనాలను నిలిపి తూకం ఆధారంగా నమోదు, కౌంటింగ్ చేయనున్నారు. లోకల్ ప్రజాప్రతినిధులు, అధికారులకే ఆ బాధ్యత అప్పగించడంతో పారదర్శకంగా చేపపిల్లల పంపిణీ కొనసాగే అవకాశం ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది. కానీ అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి పూర్తి వివరాలు అందలేదని సమాచారం. ఆయా జిల్లాల్లో ఎన్ని చెరువు, కుంటల్లో నీరు ఉందని, ప్రాజెక్టుల్లో నీరు ఎంత ఉంది.. చేపపిల్లలు పోస్తే ఏమేరకు పెరుగుతాయని, మత్స్యకారులు జీవనోపాధి లభిస్తుందనే వివరాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను కోరింది. ఇప్పటివరకు టీమత్స్యయాప్ లో సైతం రాష్ట్రంలోని ఎన్ని చెరువుల్లో నీరు ఉందనే వివరాలను కూడా అప్ లోడ్ చేయలేదు. ఎప్పటివరకు నీటి లభ్యత నివేదికలు అందుతాయి.. ఎప్పుడు అధికారులు ప్రకటిస్తారనేది చూడాలి.జిల్లాల వారీగా కలెక్టర్ల ఇచ్చే నీటి నివేదికల ఆధారంగా ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కోసం లక్షలాది మంది మత్స్యకార్మికులు ఎదురుచూస్తున్నారు.
Also Read: జి గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్రకు బిగ్ రిలీఫ్.. రూ. 22,000 కోట్ల రుణ ప్రణాళికకు ఆమోదం!