Hydraa: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పార్కు కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్కు స్థలం ఉంది, స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ప్రాణవాయువు అందుతుందని భావించిన స్థానికుల ఆశలకు ఆక్రమణలు, కబ్జాలు అడ్డుపడుతున్నాయి. ప్రజావసరాల కోసం కేటాయించిన భూములనే రకరకాల పేరుతో మాయం చేస్తున్నారని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. లే ఔట్ వేసినప్పుడే పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ఆయా అథారిటీలకు గిఫ్ట్ డీడ్ చేసినా తర్వాత అవి ప్లాట్లుగా మారిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. లే ఔట్లో ఓపెన్ బావిగా ఉన్న ప్రాంతాన్ని తర్వాత మట్టితో నింపేసి బై నంబర్లు వేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారని, పాతబస్తీ లాల్దర్వాజాలో ఒకప్పుడు గ్రామకంఠంగా ఉన్న 2 ఎకరాల భూమి కబ్జాకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
సికింద్రాబాద్లోని హస్మత్పేట బోయిన్ చెరువు 66 ఎకరాలుండేదని, ఇపుడదీ 30 ఎకరాలే మిగిలిందని, కబ్జాలను నియంత్రించి చెరువును కాపాడాలని స్థానికులు ప్రజావాణిలో హైడ్రాను కోరారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి 59 ఫిర్యాదులందగా, వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి, పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. కొన్ని ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి త్వరలోనే వస్తామని కమిషనర్ ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. గతంలో హైడ్రాకు ఫిర్యాదు చేయగా, మా పార్కును కాపాడారంటూ పలువురు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కృతజ్ఞతలు సైతం తెలిపారు. పార్కును కాపాడుకున్నారంటూ తిరిగి వారినే శాలువతో హైడ్రా కమిషనర్ సన్మానించటం విశేషం. ఇది ఒక రకంగా కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు భయపడే వారికి ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు.
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం సాహేబ్కలాన్లో సర్వే నెంబరు 225లో 16.35 ఎకరాల మేర మెడికల్ అండ్ హెల్త్ కాలనీ లే ఔట్ను 216 ప్లాట్లతో వేశారు. ఇందులో 305 గజాల స్థలంలో ఓపెన్ బావి ఉంది. దీనికి పక్కన ఉన్న ప్లాట్లను అమ్మినప్పుడు హద్దుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 22 ఏళ్ల తర్వాత 2002లో దీనిని పూడ్చేసి ప్లాట్లుగా విక్రయించినట్లు, వెంటనే కాపాడి ప్రజా వినియోగానికి ఉపయోగపడేలా చూడాలని అక్కడి నివాసితుల సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని సర్వే నెంబరు 1019, 1020/ పి లో ఇండస్ వ్యాలీ-2 పేరిట ఉన్న లే ఔట్లో 672 గజాల పార్కును ప్లాట్లుగా మార్చితే, దానిని కాపాడుకోడానికి అక్కడి స్థానికులు చేసిన ప్రయత్నాన్ని హైడ్రా కమిషనర్ అభినందించారు. పార్కును హైడ్రా కాపాడగా, వెంటనే 10 సిమెంట్ బెంచీలు, మొక్కలు నాటి, అభివృద్ధి చేశామని ఆ కాలనీ అధ్యక్షుడు వజ్రాల కోటి రెడ్డి తెలిపారు. హైడ్రా చర్యలను అభినందించారు. పార్కును కాపాడుకోవడంలో చురుకైన పాత్ర పోషించినందుకు కోటి రెడ్డితో పాటు హైడ్రా ఇన్స్పెక్టర్ బాలగోపాల్ను హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా శాలువతో సన్మానించారు.
Also Read: Khammam district: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. పేదల గూడుపై సర్కార్ ఉక్కుపాదం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం చర్లపల్లిలోని ఈసీనగర్లో ఎకరం స్థలాన్ని పార్కుగా కేటాయించగా, లే ఔట్ వేసినప్పుడు ఆ భూమిని అమ్మిన వ్యక్తే తనదంటూ ఆక్రమించాడని, చుట్టూ ప్రహరీ నిర్మించారని ఈసీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీవన్కుమార్, జగ్గరాజు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో మున్సిపాలిటీ వాళ్లు పార్కు ల్యాండ్గా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసినా, కబ్జాలు ఆగలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వందలాది మంది నివాసించే కాలనీలో ఉన్న పార్కును కాపాడాలంటూ హైడ్రాను కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్లో మిథిలానగర్, విష్ణుప్రియ ఎన్క్లేవ్ హద్దులలో 35 గుంటల పార్కు ఉండగా, అందులో రకరకాల ఆలయాల పేరిట ఆక్రమణలు జరుగుతున్నాయని, అందరికీ ఉపయోగపడే పార్కుగా కొనసాగించాలని హైడ్రా ప్రజావాణిలో అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. విష్ణు ప్రియా ఎన్క్లేవ్కు చెందిన ఈ స్థలాన్ని పార్కు వినియోగానికే ఉపయోగపడేలా చూడాలని కోరారు. రంగారెడ్డి జిల్లా, మియాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీలో ఉన్న పార్కు భూమిని పరిరక్షించాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
నాయమ్మ కుంటకు ఆనుకుని ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసి, ఎలాంటి కొత్త నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని వారు కోరారు. ఈ నేపథ్యంలో పార్కు భూమిని రక్షిస్తూ మొక్కలను నాటేందుకు అనుమతివ్వాలని, లేక సంబంధిత అధికారులు స్వయంగా చెట్లను నాటి గ్రీన్ స్పేస్గా అభివృద్ధి చేయాలని అసోసియేషన్ కోరినట్లు హైడ్రా వెల్లడించింది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని బందంకొమ్ము గ్రామంలో స్మశానవాటిక, వాటర్ ట్యాంక్ ఉన్న స్థలం, మహిళా భవనానికి కేటాయించిన భూమలో నిర్మాణాలు చేపట్టి రియల్ ఎస్టేట్ సంస్థలు కబ్జా చేస్తున్నాయని, వాటిని కాపాడేందుకు ప్రయత్నిస్తే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అక్కడి స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం, శంషాబాద్ జోన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో సున్నం చెరువు, రెడ్డికుంటతో పాటు ఇతర చెరువులకు వెళ్లే వరద కాలువ కబ్జాలకు గురవుతున్నాయని, దీంతో ప్రతి ఏటా వరద తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. వర్షాకాలంలో నెల రోజుల పాటు వరదలోనే ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే వరద కాలువల కబ్జాలను నివారించి చెరువులను అనుసంధానం చేసేలా వాటిని అభివృద్ధి చేయాలని ఫిర్యాదులో కోరారు.
Also Read: AI Deepfake Scams: డేంజర్ బెల్స్.. ఏఐ బయోమెట్రిక్ మోసాలకు తెరలేపిన సైబర్ క్రిమినల్స్!