Etela Rajender: స్వేచ్ఛ, బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను గుంజుకుంటూ చూస్తూ ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కోహెడ భూభాదితుల సంఘం ధర్నాలో ఈటల రాజేందర్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోహెడ గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు భూతల్లిని నమ్ముకుని నివసిస్తున్నారని, నాలుగు తరాలుగా ఆ భూములను దున్నుకుని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. వారికి ఆనాటి ప్రభుత్వాలు ఎంక్వైరీ చేసి పట్టాలు ఇచ్చిందన్నారు. 12 సంవత్సరాల పైబడి పేదలు భూములపై జీవనం కొనసాగిస్తే ఆ భూములను ముట్టుకునే అధికారం ఎవరికీ ఉండదని గుర్తుచేశారు. రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములకు కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాలని తాము డిమాండ్ చేశామని, ఆ సమయంలో అసైన్డ్ భూముల వారికి కూడా డబ్బులు వచ్చాయని ఈటల గుర్తుచేశారు.
అసైన్డ్ భూములు అమ్ముకునే అధికారం లేదు కానీ అనుభవించే అధికారం శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. గవర్నమెంట్ అంటే ఎవడబ్బ జాగీర్ కాదని, గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రజలని ఆయన వ్యాఖ్యానించారు. బయట రాష్ట్రాల్లో 15-20 ఏళ్ల అసైన్డ్ భూములపై జీవనం సాగించినవారికి ఆ భూములను అమ్ముకునే అధికారం కల్పించారని ఈటల వివరించారు. కానీ కేసీఆర్ వచ్చాక ఒక దరిద్రపు స్కీమ్ తీసుకొచ్చారని, అదే ల్యాండ్ పూలింగ్ అని రాజేందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దాని పేరుతో ఒక ఎకరం లాక్కుని 400 గజాలు ఇచ్చారని, ప్రభుత్వానికి భూమి ఎక్కడ అవసరం వచ్చినా పేదల భూమి మాత్రమే ఎందుకు గుంజుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. గవర్నమెంట్ భూములు లేవా? అని నిలదీశారు. ఆనాడు కేసీఆర్ ఈ భూములు లాక్కుని 300 గజాల చొప్పున ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వకుండా పేదల కళ్ళల్లో మట్టి కొట్టాడని ధ్వజమెత్తారు.
ఇకపోతే తనది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడన్నారు. షావుకారు గుట్టలకు సంబంధించిన భూములకు పరిహారం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వ భరతం పడతామని ఈటల హెచ్చరించారు. అది చాలక మార్కెట్ కోసం కోహెడలో 159 మంది రైతులు సాగు చేస్తున్న 239 ఎకరాలు భూములను తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు.. ప్రజలు, పేదలకు న్యాయం, ధర్మం చేయాలి తప్పితే దౌర్జన్యం చేయొద్దని సూచించారు. పాత షావుకారు గుట్టలకు ఎలా పరిహారం అందించారో.. ఇప్పుఉ కూడా అలాగే అందించాలని డిమాండ్ చేశారు. కోహెడ గుట్టలను లాక్కునే ప్రయత్నం చేయొద్దని స్పష్టంచేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి.. వెంటనే స్పందించి సీఎంతో చర్చలు జరిపి కోహెడ గుట్టల పేదల భూములకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందని విర్రవీగితే గత సీఎం కేసిఆర్ ఫ్యూజులు పీకారని, ఈ ప్రభుత్వం కూడా అలాగే విర్రవీగితే రేవంత్ ఫ్యూజు కూడా పీకడం ఖాయమని హెచ్చరించారు.
Also Read: CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం