Excise Constable Soumya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆమె తెగువను ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి ఆర్థిక సాయం (ఎక్స్గ్రేషియా) అందజేస్తుందని తెలిపారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆమెపై ఆధారపడిన కుటుంబం ఇబ్బంది పడకుండా, సౌమ్య రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు ఆమెకు అందాల్సిన పూర్తి జీతభత్యాను కూడా కుటుంబానికి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జనవరి 23న నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో నిందితులు తమ కారుతో సౌమ్యను ఢీకొట్టి ఆమెపై నుండి దూసుకెళ్లారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
సౌమ్య మరణం ఎక్సైజ్ శాఖలో భద్రతా పరమైన మార్పులకు నాంది పలికింది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులకు కూడా ఆయుధాలు (తుపాకులు) అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.