Formula E Race case update: ఫార్ములా ఈ రేసు కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందా? ఈ కేసులో మళ్లీ కదలిక మొదలైందా? ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ ను మరోసారి విచారించనుందా? ఈయన విచారణతో కేసు ముగింపుకు వస్తుందా? లేక ఎవరైనా ఉన్నారా ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతున్నాయి.
ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు వేగంగా ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన వివరాలను క్రోడీకరించారు. అయితే కొన్ని విషయాలు అలాగే ఉండిపోవడంతో మళ్లీ అటువైపు దృష్టిపెట్టింది ఏసీబీ. ఈ క్రమలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మరోసారి విచారిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన లండన్ నుంచి విచారణకు హాజరైనట్టు సమాచారం.
కీలక సమాచారం వస్తే వేగంగా ముగింపు ఇవ్వాలన్నది ఏసీబీ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ శాఖ-ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందాలపై ప్రశ్నించనుంది. అందులో ఉల్లంఘనలపై ఏసీబీ ఫోకస్ చేసింది. గత నెలలో వర్చువల్గా ఎఫ్ఈవో సీఈఓ ఆల్బర్టో హాజరయ్యారు. సీజన్-9 చెల్లింపులు , లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ లకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టిందట ఏసీబీ.
ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజీర్ బీఎల్ఎన్రెడ్డిలను పలుమార్లు విచారించింది ఏసీబీ. ఆ తర్వాత నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులను సైతం విచారించింది. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ గురించి గ్రీన్ కో సంస్థ నుంచి సమాచారాన్ని రాబట్టింది.
ALSO READ: మాజీ మంత్రి హరీష్రావుపై మరో కేసు
ప్రస్తుతం ఎఫ్ఈవో సీఈవోను విచారిస్తున్నారు అధికారులు. దీంతో విచారణ పూర్తి అయినట్టేనా? క్రాస్ చెక్కింగ్ కోసం మరోసారి మిగతా వాళ్లని పిలుస్తారా అనేది తెలియాల్సింది. మరోవైపు ఇదే కేసు దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ వ్యవహారంలో కీలకమైన వారిని మాత్రమే విచారించింది. ఆ తర్వాత ఈడీ నుంచి ఎలాంటి కదలిక రాలేదు.