Gaddam Vamsikrishna: పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పనితీరుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా నుంచి వస్తున్న వడ్లను మిల్లర్లు తీసుకోవడం లేదని, దీనికి కలెక్టర్ తీరే కారణమని ఆయన మండిపడ్డారు.
జిల్లాలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకే ఎందుకు తీసుకుంటున్నారని ఎంపీ ప్రశ్నించారు. మిగిలిన ధాన్యం సేకరణలో జాప్యం వెనుక ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా అని నిలదీశారు. మంచిర్యాల జిల్లాలో ఎక్కువ శాతం దళిత రైతులు ధాన్యం పండిస్తారని, కావాలనే వారిని ఇబ్బంది పెడుతున్నారా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
అధికారులు రాజకీయాలకు అతీతంగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వంశీకృష్ణ సూచించారు. కలెక్టర్పై తనకు వ్యక్తిగత కక్షలేవీ లేవని, కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి ఎవరినైనా ప్రశ్నిస్తానని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
Also Read: భగ్గుమంటున్న భానుడు.. రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి కీలక సూచనలు!