GHMC: క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేటి తరుణంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ అండగా నిలిచింది. అందుబాటులో సరైన సదుపాయాలు లేక ఆరోగ్య పరీక్షలు నిర్లక్ష్యం చేస్తూ కొందరు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించేందుకు నడుం బిగించింది. ఈ కార్యక్రమంలోనే పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు కార్కినోస్ హెల్త్ కేర్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మొబైల్ ఉచిత క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
మహిళలకు ఓరల్, ,బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, పురుషులకు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ భయాలు తొలగించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం. ప్రమాదస్థాయిలో ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు చెయ్యడం ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడం, వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది.
ఇండియన్ క్యాన్సర్ సొసైటి దీనికి ఫండింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 20 సర్కిళ్లకు చెందిన కార్మికులను ఈ స్క్రీనింగ్ కింద కవర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని కమిషనర్ కూడా నేరుగా పరిశీలించారు. మొబైల్ ఉచిత క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాల నిర్వహణను కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కార్మికులకు చాలా ఎఫెక్టుగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Also Read:Telangana Municipal Elections: కరీంనగర్ కార్పొరేషన్ కాషాయమయం.. ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి