GHMC Scams: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో అత్యధిక మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో విచిత్రమైన పాలన కొనసాగుతుంది. తరుచూ పూటకో ఆక్రమంగా, రోజుకో స్కామ్ వెలుగుచూసే జీహెచ్ఎంసీలో పరిపాలన, పౌర సేవల నిర్వహణతో పాటు అభివృద్ది పనులకు సంబంధించి కాంట్రాక్టులకు చెల్లించే బిల్లులు వంటి ప్రతి అంశానికి సంబంధించి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరుల్లో ముఖ్యమైన ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపు, కలెక్షన్ కు సంబంధించి కొంతకాలం నిర్వహిస్తున్న జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) ప్రకారం బయట పడ్డ ఆస్తి పన్ను వర్తింపు, ట్యాక్స్ కలెక్షన్లలో అక్రమాలు చోటుచేసుకోవటంతో గతంలో ఓ సారి విజిలెన్స్ ఎంక్వైరీ చేసినప్పటికీ, ఇదే అంశంపై మళ్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా విచారణలు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కమర్షియల్ ప్రాపర్టీలకు రెసిడెన్షియల్ ట్యాక్స్ వర్తింపజేయటం, ఫీల్డు లెవెల్ లో ఉన్న ఏరియాలో తక్కువ ఏరియాకు పన్ను వర్తింపజేయటం వంటి అంశాలపై కూడా కమిషనర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
దీంతో పాటు జీహెచ్ఎంసీలో ఇటీవలే చోటుచేసుకున్న పలు అక్రమాలకు సంబంధించి కమిషనర్ వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటి వరకు మూడు అంశాలకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క అక్రమానికి సంబంధించి విచారణ నివేదికలు బట్టబయలు కాలేదు. నివేదికలు బహిర్గతం కాకపోయినా, వాస్తవాలను వెలుగులోకి తేవాలన్న మంచి సంకల్పంతో ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత చర్యలు తీసుకోకపోవటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసలు ఫైనల్ ఎంక్వైరీ రిపోర్టులు సమర్పించారా? అన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపు, వసూళ్లకు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా, నివేదికలు రాలేదు, ఇందుకు ఎవరి మీద కూడా కమిషనర్ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేని పక్షంలో విచారణలకు ఆదేశించటంతో విలువైన విజిలెన్స్ విభాగం సమయం వృథా అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీలోని మూడు జోన్లలో దోమల నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ సీనియర్ ఎంటమాలజీ మూడు నెలలుగా గైర్హాజరై, విధుల్లో చేరిన ఓ ఎంటమాలజీ ఫీల్డు వర్కర్ ను లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, ఈ వ్యవహారంపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు కమిషనర్ కర్ణన్ విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించగా, క్షేత్ర స్థాయిలో విచారించిన విజిలెన్స్ ఈ వ్యవహారంపై కమిషనర్ కు నివేదికలను పంపినా, నేటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యమేమిటీ? అన్న వాదనలు విన్పిస్తున్నాయి. మరో వైపేమో సదరు సీనియర్ ఎంటమాలజిస్టు తన ఇంటి ఈఎంఐ సుమారు రూ. 70 వేలు కార్మికుల నుంచి గుంజె టార్గెట్ పెట్టుకుని, తనను ఎవరేం చేయరని? తాను కమిషనర్ మనిషిని బయట ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది.ఇదే ఆఫీసర్ గతంలో ఎల్బీనగర్ లో విధులు నిర్వహిస్తూ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సందర్భం కూడా ఉంది.
Also Read: మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు
సదరు సీనియర్ ఎంటమాలజిస్టు అవినీతిపై నిన్న మొన్నటి వరకు జోనల్ కమిషనర్ విధులు నిర్వహించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ కు కూడా ఫిర్యాదులు అందటంతో ఆమె సదరు సీనియర్ ఎంటమాలజిస్టును మూడు జోన్ల బాధ్యత నుంచి తప్పించాలని భావించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ అనూహ్యంగా సదరు ఐఏఎస్ ఆఫీసరే సర్కారు ఇటీవలే చేపట్టిన బదిల్లో ట్రాన్స్ ఫర్ అయ్యారు. దీంతో సదరు ఎస్ఈ అక్రమాలపై చర్యలకు తెర పడినట్టయింది. దీంతో పాటు స్పోర్ట్స్ వింగ్లో కూడా మెటిరీయల్ కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను రహస్యంగా నిర్వహించి, వచ్చిన సింగిల్ టెండర్కు అడ్డదారిలో అప్పగించారన్న ఆరోపణలు రావటంతో ఈ వ్యవహారంపై కూడా కమిషనర్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు, సీనియర్ ఎంటమాలజీ లంచాల డిమాండ్ పై విచారణ ముగిసిన, కమిషనర్ కు నివేదికలు కూడా సమర్పించినా, ఎందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్న తలెత్తుతుంది.
జీహెచ్ఎంసీలో కారుణ్య నియమాకాలకు సంబంధించి లంచాలు, ఎంటమాలజీ, శానిటేషన్, వెటర్నరీ విభాగాల్లోని ఔట్ సోర్సింగ్ పొస్టుల్లో నియామకాలు జరిపేందుకు లంచాలు డిమాండ్ చేసిన, లంచాలు తీసుకుని నియమించిన, లంచాలు తీసుకుని మోసాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై కూడా కమిషనర్ కర్ణన్ గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విచారణ తుది దశలో ఉన్నట్లు త్వరలోనే ఐబీ అవినీతికి పాల్పడిన అక్రమార్కుల జాబితాను కమిషనర్ కు సమర్పించనున్నట్లు తెలిసింది.
Also Read: మల్కాజ్గిరిలో బీజేపీ ముసలం.. ప్రీతిరెడ్డికి చెక్ పెట్టిన బీజేపి అధిష్టానం..!