Teachers Promotions: ఉపాధ్యాయ లోకానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. దీనితో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. రానున్న రెండు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 30 వరకు ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. మొత్తం మీద సుమారు 3,500 మందికి పదోన్నతులు లభించనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన పలువురు ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఉపాధ్యాయులకు గొప్ప ఊరటనివ్వడంతో పాటు.. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కూడా దోహదపడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెడ్మాస్టరుగా పదోన్నతి పొందనున్నారు. పదవీ విరమణల కారణంగా దాదాపు 750 గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. తద్వారా ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేస్తారు.
ముఖ్యంగా ఎస్జీటీ కేడర్లోని చాలా మంది ఉపాధ్యాయులు, సంవత్సరాల తరబడి ఒకే స్థాయిలో కొనసాగుతూ.. తమకు ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయోనని ఆశగా ఎదురుచూశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జాప్యం, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ పదోన్నతులు ఆలస్యమయ్యాయని తెలిపారు.
దీంతో కేవలం ఉపాధ్యాయుల వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా.. విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఉన్నత స్థాయి పోస్టులు ఖాళీ అవ్వడం వల్ల కొత్త ఉపాధ్యాయ నియామకాలకు కూడా మార్గం సుగమమవుతుంది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇది నిరుద్యోగులకు ఎంతో ఊరట కలిగించే అంశంగా చెప్పకోవచ్చు.
Also Read: బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్.. కారణం ఎవరు? రాబోయే రోజుల్లో జరిగేది ఇదేనా.?
దీని ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరి, విద్యార్థులకు మెరుగైన బోధన లభిస్తుంది. అలాగే.. ప్రధానోపాధ్యాయుల పోస్టులు భర్తీ అవ్వడం వల్ల పాఠశాలల పర్యవేక్షణ, నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుంది. అంతేకాకుండా ఇది రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఒక కీలక అడుగుగా భావించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.