Harish Rao Challenge to CM Revanth Reddy : తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను ఆగస్టు 15వ తేదీ లోగా అమలు చేయడంతో పాటు.. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేస్తానని ఎల్లుండి అమర వీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలన్నారు. రేవంత్ చెప్పినవి చెప్పినట్లుగా, చెప్పిన గడువులోగా పూర్తి చేస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఇవి చేయలేని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రతిసవాల్ చేశారు.
గతంలో కొడంగల్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి.. మాట తప్పారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం వాళ్లకు పరిపాటిగా మారిందన్నారు.
Also Read : డామిట్.. కథ అడ్డం తిరిగింది, పెద్దాయన మాటలు నిజమే?
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ధాన్యానికి రూ.500 బోనస్ లేదు. నిరుద్యోగ భృతి లేదు. ఏవీ చేయకుండా.. రైతు రుణమాఫీ చేస్తే.. రాజీనామా చేస్తావా అని తనకు సవాల్ చేయడాన్ని హరీశ్ రావు సీరియస్ గా తీసుకున్నారు. హరీశ్ రావు ప్రతిసవాల్ చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కాగా.. సికింద్రాబాద్లో హస్తం జెండా ఎగురబోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్ను నమ్మితే పద్మారావు మునిగినట్టేనని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆయన పరువు తీయడానికే సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని దుయ్యబట్టారు. పద్మారావు నామినేషన్కు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ టికెట్ను బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని రేవంత్రెడ్డి విమర్శించారు.