Harish Rao: కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా జలాల వినియోగంపై పూర్తి ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ 66 శాతం నీటిని మాత్రమే వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటికే 80 శాతం అంటే సుమారు 664 టీఎంసీల నీటిని తరలించుకుపోయిందని ఆయన వెల్లడించారు. ఈ దోపిడీపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీ (KRMB)కి లేఖ రాసినప్పటికీ, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నీటి తరలింపును అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 28న ఇరిగేషన్ ఈఎన్సీ (ENC) రిటైర్ అయిన తర్వాత, వారం రోజుల పాటు ఆ కీలక పోస్టును భర్తీ చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తుంటే, కనీసం అడ్డుకోవాల్సిన బోర్డు సభ్యుడు లేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ‘గురువు’ చంద్రబాబు నాయుడుపై ఉన్న భయం వల్లే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అడగడం లేదని, చంద్రబాబుకు ‘గురుదక్షిణ’గా తెలంగాణ నీటి వాటాను రాసిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ అవసరాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని, సాగు మరియు తాగునీటి అవసరాల కోసం మనం వాడుకోవాల్సిన 34 శాతం వాటాలో కేవలం 20 శాతం మాత్రమే వినియోగించుకున్నామని హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం ఏపీ రోజుకు 1.5 టీఎంసీల నీటిని అక్రమంగా తీసుకుపోతుంటే, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పంటల పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంతో పోలిస్తే కాంగ్రెస్ హయాంలో అతి తక్కువ కృష్ణా జలాలను వినియోగించడం ముఖ్యమంత్రి వైఫల్యానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని, అడ్మినిస్ట్రేషన్పై ఆయనకు పట్టు లేదని విమర్శించారు.
కేఆర్ఎంబీ తీరును కూడా ఆయన తప్పుబట్టారు. రాష్ట్రం 664 టీఎంసీల దోపిడీ జరిగిందని చెబుతుంటే, బోర్డు మాత్రం 555 టీఎంసీలే అని తక్కువ చేసి చూపడం ఏపీకి కొమ్ముకాయడమేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉన్న కేఆర్ఎంబీని ప్రశ్నించడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ (RR) ట్యాక్స్ స్కామ్లు బయటపడుతాయనే భయంతోనే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని, బీజేపీ-కాంగ్రెస్ కలిసి తెలంగాణ గొంతు పిసుకుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని, త్వరలోనే కేఆర్ఎంబీ ఆఫీస్ను ముట్టడించడంతో పాటు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని హరీశ్ రావు హెచ్చరించారు.
Read Also: Thummala Nageswara Rao: తెలంగాణకు ఇచ్చింది 51 వేల కోట్లే.. కేంద్ర విధానాలపై మంత్రి తుమ్మల ఫైర్!