Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా శుక్రవారం కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయని ప్రచారం చేస్తున్న సీఎం.. మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు.
ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేరు..
ఎల్లంపల్లి, మిడ్మానేరు, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం.. ఇవన్నీ రికార్డు స్థాయి పంట సాగుకు కారణాలు కావా? మసిపూసి మారేడు కాయ చేసినంత మాత్రాన వాస్తవాలు దాగుతాయా? అన్నారు. ఎల్లంపల్లి–మిడ్మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలు అన్న వాస్తవాన్ని ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేరన్నారు. కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ, నిజాంసాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేరన్నారు.
బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు..
వ్యవసాయం, సాగునీటి రంగాలపై మీరు చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారిందన్నారు. గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారన్నారు.అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం ఆపండి.. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించేలా తక్షణమే చర్యలు తీసుకోండి అని సూచించారు. ఎజెండా అంశాలు తొలగించకుండా ఈనెల 18న జరిగే మీటింగ్ కు హాజరు అయితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధం అని ప్రకటించారు.
Also Read: ‘ఎవరి జాగీరని ఫొటోలు పెట్టుకుంటున్నారు?’ రేవంత్ సర్కార్పై అర్వింద్ ఫైర్!