Harish Rao: సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు. రైతులు అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా గమనించిన ఆయన, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు నత్తనడకన సాగడం, రైతులకు బకాయిలు చెల్లించకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం వంటి అంశాలను ఆయన ఘాటుగా ప్రస్తావించారు.
పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, రైతులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారని అన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం కొనుగోలు చేసినవి కేవలం 5–6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ మాటల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయినట్టేనన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని సెంటర్ల వద్ద రోజులు గడిపే పరిస్థితి తలెత్తిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు చేసినా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు. సుమారు రూ.1200 కోట్ల MSP బకాయిలు అదనంగా రూ.200 కోట్ల బోనస్ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 24 గంటల్లో బోనస్ ఇస్తామని అన్నారు, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. అయినా రైతులే తప్పేమో అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది అని హరీశ్ రావు మండిపడ్డారు.
గత యాసంగి బోనస్, ఈ వానాకాల బోనస్ రెండూ జారీ చేయలేదని, వెంటనే సొమ్ము విడుదల చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. వడ్ల రైతులే కాదు, మక్క రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మక్క సాగు జరిగింది. కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల రైతులు అప్పులపాలు అవుతున్నారని ఆయన అన్నారు. మక్క రైతుల్ని పూర్తిగా ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తోంది. వెంటనే డబ్బులు విడుదల చేసి, కొనుగోలు వేగవంతం చేయాలి” అని డిమాండ్ చేశారు.
పత్తి రైతులు కేంద్ర ప్రభుత్వ సిసిఐ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెబుతున్నారు. కానీ అనేక జిల్లాల్లో రైతులు 11–12 క్వింటాళ్లు పత్తి పండించారు. మిగిలిన పత్తి ఏం చేయాలని మీరు చెప్పండి? అని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర బీజేపీ రైతులను అరిగోస పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు జిన్నింగ్ మిల్ వాళ్ళు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సిసిఐ పత్తి కొనుగోలు సరిగ్గా చేయడం లేదన్నారు. పత్తి రైతులు అప్పులపాలు అయిపోయి రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పత్తి రైతులకు బీజేపీ ప్రభుత్వం, మక్క రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. రేవంత్ రెడ్డి రైతులను అన్ని రకాలుగా మోసం చేశాడని తీవ్రంగా మండిపడ్డారు. రెండు పంటలకు రైతు బంధు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. బోనస్ లేదు, పంటల బీమా సగం మందికే, రుణమాఫీ కూడా ఆచరణలో లేదు అని విమర్శించారు.
Also Read: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారు.. సజ్జనార్కి సీవీ ఆనంద్ అభినందనలు
పోయిన యాసంగిలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు, ఈ ఏడాది తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందలేదన్నారు. పంటల బీమా చేసి ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేవి. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.