Venkaiah Naidu: సీనియర్ జర్నలిస్ట్, స్వాతంత్య్ర సమరయోధుడు జి. కృష్ణ నీతి, నిజాయితీ, నిబద్ధతలతో జీవించిన గొప్ప వ్యక్తి అని, ఆయన గురించి ప్రస్తుత యువ జర్నలిస్టులందరూ తప్పక తెలుసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో జరిగిన కార్యక్రమంలో జి. కృష్ణ రాసిన ‘అప్పుడు- ఇప్పుడు’, ‘అనుభవాలు- జ్ఞాపకాలు’ అనే రెండు గ్రంథాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జి. కృష్ణను స్మరించుకుంటూ, ఆయన అసలు పేరు గండూరి కల్యాణ వేణుగోపాల కృష్ణమూర్తి అని తెలిపారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ వంటి ప్రముఖ పత్రికలలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు. 1924 అక్టోబర్ 24న అప్పటి మద్రాస్ (ప్రస్తుత కర్నూలు జిల్లా)లో జన్మించిన కృష్ణ, 2001 ఏప్రిల్ 6న మరణించారు.
అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుత జర్నలిజం, రాజకీయాల పోకడలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. “కొంతమంది జర్నలిస్టులు ఎర్న లిస్టులు అయ్యారు, కొంతమందికి సంపాదకీయం సంపాదనగా మారింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు రోజురోజుకీ అద్వానంగా తయారవుతున్నాయని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడటం దారుణమని విమర్శించారు. రాజకీయ నాయకులు ఎలా ఉన్నా, జర్నలిస్టులు నిబద్ధతతో ఉండి దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
చివరగా, తాను పదవి విరమణ మాత్రమే చేశానని, ప్రజల పక్షాన మాట్లాడే “పెదవి విరమణ” చేయలేదని వెంకయ్య నాయుడు చమత్కరించారు.
Read Also: Bihar NDA Government: మరోసారి ముఖ్యమంత్రిగా నితీశ్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆయన 2017 నుండి 2022 వరకు భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించిన వెంకయ్య నాయుడు, 2002 నుండి 2004 వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వాగ్ధాటికి, తెలుగు భాషాభిమానానికి ప్రసిద్ధి చెందారు. 1978లో ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం పార్లమెంటులో తన వాణిని వినిపించారు. 2024లో భారత ప్రభుత్వం ఆయనను దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’తో గౌరవించింది.