తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుల పర్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా గొంతు నొక్కడం ద్వారా వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తూ, రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
అర్ధరాత్రి అరెస్టులు.. అరాచక పాలన
జర్నలిస్టులేమైనా టెర్రరిస్టులా..? లేక బ్యాంకులను లూటీ చేసిన ఆర్థిక నేరగాళ్లా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. పండుగ పూట అర్ధరాత్రి వేళ తలుపులు బద్దలుకొట్టి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టించేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శబరిమల యాత్రలో ఉన్న జర్నలిస్టులను సైతం సంబంధం లేకపోయినా ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు.
పోలీసు వ్యవస్థపై విమర్శలు
హోం శాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి, పోలీసులను తన ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన పోలీస్ అధికారిలా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ మంత్రులు అసభ్యకర వ్యాఖ్యలు చేసినప్పుడు లేని ఉత్సాహం, ఇప్పుడు జర్నలిస్టుల విషయంలో ఎందుకు కనిపిస్తోందని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, అధికార పార్టీ నేతల అరాచకాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
దళిత జర్నలిస్టులపై కక్షసాధింపు
సుధీర్ అనే దళిత జర్నలిస్టుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చూడటం రేవంత్ రెడ్డి వికృత చర్యలకు పరాకాష్ట అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు కుల సమీకరణలను వాడుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్లను బెదిరించినా, పేదల భూములు కబ్జా చేసినా పట్టించుకోని పోలీసులు, సోషల్ మీడియా వారియర్స్, జర్నలిస్టుల ఇళ్లపై పడి అరెస్టులు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని స్పష్టం చేశారు.
పోరాటాలకు బీఆర్ఎస్ మద్దతు
ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో మీడియా పాత్ర కీలకమని, జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు ప్రకటించారు. అక్రమ కేసులు, వేధింపులు కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అల్లు అర్జున్ వంటి నటులను, మహిళా జర్నలిస్టులను, చివరికి తన సహచర మంత్రులను సైతం వదలకుండా హరాస్ చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన వెల్లడించారు.
ALSO READ: Kishan Reddy: తెలంగాణ పల్లెలకు శుభవార్త.. రూ. 11 వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం