Harish Rao: కార్మికులు సమ్మె చేయడం గతంలో చూశామని.. కానీ అధికారులు ఆందోళనకు దిగడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. అధికారులు సైతం సమ్మెకు దిగి రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా పీఆర్పీ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) చెల్లించామని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత రెండేళ్లుగా పీఆర్పీ నిలిపివేసి అధికారుల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు.
పీఆర్పీ, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరాహార దీక్షకు దిగింది. ఈ సందర్భంగా వారికి సంఘీబావం తెలిపిన హరీశ్ రావు అనంతరం మాట్లాడారు. పీఆర్పీ ఇస్తే అధికారుల్లో ఉత్సాహం పెరిగి ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కానీ రెండేళ్లుగా పీఆర్పీ నిలిపివేయడం వల్ల అధికారులు ఆందోళనకు గురై బొగ్గు ఉత్పత్తి భారీగా పడిపోయిందని స్పష్టం చేశారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల రాష్ట్రంలోని కేటీపీఎస్, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో కొన్ని యూనిట్లు మూతపడ్డాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి.. తెలంగాణ డిస్కంలు బయటి నుంచి పవర్ దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చిందని హరీశ్ రావు అన్నారు. దాదాపు 2,500 మంది అధికారులు నల్ల కండువాలు వేసుకుని ధర్నా చేస్తుంటే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. సింగరేణి ఎప్పుడూ కోల్ ఇండియా మార్గదర్శకాలను పాటించడం ఆనవాయితీ కాబట్టి కోల్ ఇండియాలో ఇప్పటికే అమలు చేసిన ‘పే అప్గ్రేడేషన్’ విధానాన్ని ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా? కంపెనీలు దాచే.. 5 పచ్చి నిజాలు ఇవే!
గతంలో కేవలం పనితీరు, ప్రొడక్షన్ ఆధారంగా అత్యంత పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరిగేవని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పారదర్శకతను గాలికొదిలేసి బదిలీల్లో రాజకీయ జోక్యంతో అవినీతికి వత్తాసు పలుకుతోందన్నారు. గతంలో సింగరేణి సీఎండి లేదా డైరెక్టర్లు మాత్రమే రివ్యూ మీటింగ్ల కోసం సెక్రటేరియట్కు వచ్చేవారని.. నేడు జీఎంలు, కింది స్థాయి అధికారులు కూడా పోస్టింగ్ల కోసం పైరవీకారులను పట్టుకుని డిప్యూటీ సీఎం ఇంటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సింగరేణి సీఎండి, డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క తక్షణమే ఆఫీసర్స్ అసోసియేషన్ను చర్చలకు పిలిచి.. రెండేళ్లుగా బకాయి ఉన్న పీఆర్పీ నిధులను విడుదల చేయాలన్నారు.
Also Read: ఫ్రిజ్లో పాలు పెడుతున్నారా? ఈ తప్పు చేస్తే పారబోయాల్సిందే!