Heavy Rain Alert: తెలంగాణలో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది క్రమంగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్,ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఆదివారం ఆదిలాబాద్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 23.8 డిగ్రీ సెల్సియస్గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.
ఈ అకాల వర్షాలు.. తీరని నష్టాన్ని మిగిల్చుతున్నాయి. తెలంగాణలో చేతికందిన దాన్యం నీటిపాలవుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది.
ఈదురుగాలులతో మమ్మాయిపల్లి మహాదేవుని పేటలో కరెంట్ స్తంబాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగి నేలపై పడ్డాయి. అలాగే మహదేవన్పేట శివారులోని రెండు కోళ్ల ఫారాలు నేలమట్టమయ్యాయి. రేకులు ఎగిరిపోయి గోడలు కూలిపోయాయి. ఇటు తాడూరు మండలంలోని పర్వతాయపల్లిలో గాలి దుమారానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వలిగొండ మండలంలోని పలుచోట్ల ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. దాంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
Also Read: హైదరాబాద్లో త్వరలో ఈకో టౌన్ ఏర్పాటు.. జపాన్తో కీలక ఒప్పందం
మరోవైపు.. ప్రకాశం జిల్లాలో పిడుగుపాటు ఇద్దరిని బలి తీసుకుంది. పెద్ద ఓబినేనిపల్లిలో క్రికెట్ ఆడుతుండగా…ఒక్కసారిగా పిడుగుపడింది. దాంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు గొర్రెలను మేతకు వెళ్లిన కాపరికి తీవ్రగాయాలయ్యాయి.
విపరీతంగా వీచిన ఈదురుగాలులు, జోరుగా కురిసిన వర్షం ప్రభావానికి.. బిజినేపల్లి మండలంలోని మమ్మాయిపల్లి మహాదేవుని పేటలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగి నేల మీద పడ్డాయి. రెండు కోళ్ల ఫారాలు నేలమట్టమయ్యాయి. రేకులు ఎగిరిపోయి, గోడలు కూలిపడ్డాయి. మనుషులు, కోళ్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
తాడూరు మండలంలోని పర్వతాయపల్లి పరిసర గ్రామాలలో ఈదురుగాలులతో పాటు కుండపోతగా వర్షం కురిసింది. దీని ప్రభావానికి మామిడి చెట్లు విరిగిపోయి, కాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం ప్రభావం రైతన్నలకు భారీ నష్టాన్ని మిగిల్చింది.