Rain Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు అంతగా కొట్టడం లేదు. జూన్ నెల మొదటి నుంచి వర్షం రైతులను నిరాశపరిచింది. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ ఫస్ట్ నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వరుణ దేవుడి వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఈ రోజు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఈ రోజు హైదరాబాద్ లో చిరుజల్లులు పడగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలతో పాటు కరీంనగర్ లో కూడా వర్షం పడింది. ఇక వరంగల్ రూరల్ ప్రాంతాలు పరకాల, నర్సంపేటతో పాటు భయ్యారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షం పడింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే కొన్ని గంటల్లో జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుసే ఛాన్స్ ఉందని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళఖాతంలో రాబోయే కొద్ది గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అధికారులు వివరించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు వెల్లడించారు.
ALSO READ: DMHO Jobs: అద్భుత అవకాశం.. పదితో సొంత ఊరులో జాబ్.. ఆ జిల్లాలో 1294 ఉద్యోగాలు
అటు ఏపీలో కూడా నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ALSO READ: MECL: టెన్త్, ఐటీఐతో ఉద్యోగాలు.. రూ.55,900 జీతంతో ఉద్యోగాలు, ఇంకా కొన్ని రోజులే భయ్యా..
అయితే.. ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.