Hemakanth Reddy : గాయని మంగ్లీ ఆర్థిక మోసం వివాదం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమాకాంత్ రెడ్డి తాజాగా బిగ్ టీవీతో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పైగా తనే ఒక బాధితుడినని ఆయన పేర్కొన్నారు. “మంగ్లీ.. మధు ఇద్దరూ ఒక్కటై నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు ఏమైనా జరిగితే దానికి మంగ్లీయే బాధ్యత వహించాలిజ” అంటూ తన ప్రాణాలకు హాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రమావత్ మధు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తన వద్ద 10 కోట్లు ఉంటే మధు నేరుగా వచ్చి తనతో మాట్లాడాలని సవాల్ విసిరారు. ఒకవేళ తాను అంత డబ్బు తీసుకుంటే ఇప్పటివరకు తనపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు మంగ్లీకి పూర్తిగా తెలుసని హేమాకాంత్ రెడ్డి ఆరోపించారు. ‘గోకులనంద ఇన్ఫ్రా’ పేరుతో మధు అనేక మందికి ఆశ చూపి డబ్బులు వసూలు చేశాడని, మంగ్లీ సోదరుడు శివ చౌహన్ స్వయంగా సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెట్టమని చెప్పడం వల్లే చాలా మంది ఇన్వెస్ట్ చేశారని వెల్లడించారు. మంగ్లీ సోదరుడు కూడా ఈ స్కామ్లో డబ్బులు తీసుకున్నారని, మధు ఎవరో మంగ్లీకి బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, మంగ్లీ చెల్లెలిని మధు పెళ్లి చేసుకోబోతున్నాడని స్వయంగా వారి ముందే చర్చ జరిగిందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై తాము ఈడీ కి కూడా ఫిర్యాదు చేయబోతున్నామని హేమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వివాదం మూలాలు ‘గోకులనంద ఇన్ఫ్రా’ అనే సంస్థ చుట్టూ ఉన్నాయి. రమావత్ మధు అనే వ్యక్తి ఈ సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్.. సిమెంట్ ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 100 మంది నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో ప్రముఖ జానపద గాయని మంగ్లీ పేరును, ఆమె పాపులారిటీని వాడుకుని పెట్టుబడిదారులను ఆకర్షించారని బాధితులు చెబుతున్నారు. మంగ్లీ సోదరుడు శివ చౌహన్ ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడని, అందుకే తాము నమ్మి డబ్బులు ఇచ్చామని బాధితులు పేర్కొంటున్నారు.
న్యాయవాది సుబ్బారావు బాధితుల తరపున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మంగ్లీని ఈ కేసులో ఏ5 నిందితురాలిగా చేర్చారు. అయితే, మంగ్లీ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ తాను నిర్దోషినని, తన పేరును కొందరు వాడుకుంటున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి.. మధు పరస్పర ఆరోపణలు చేసుకోవడం, మంగ్లీ కుటుంబాన్ని ఇందులో లాగడం వల్ల ఈ ఆర్థిక నేరం ఒక పెద్ద క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తోంది. వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఎక్కడికి పోయిందనేది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Read Also: తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత