TG High Court: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషి వేసిన పిటిషన్పై హైకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జోషి వేసిన పిటిషన్పై బుధవారం న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.
బీఆర్ఎస్ హయాంలో శైలేంద్రకుమార్ జోషి నీటిపారుదల శాఖలో ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ఆయన వేసిన పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్-జస్టిస్ మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనాన్ని కోరారు. జోషి క్వాష్ పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది న్యాయస్థానం.
ఇరిగేషన్ మాజీ కార్యదర్శి జోషికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గరకు ఎలా వచ్చింది? దీనిపై వివరణ ఇవ్వాలని జోషి తరుపు న్యాయవాదికి ఆదేశించింది. నివేదిక అసెంబ్లీలో పెట్టారు కాబట్టి మా దగ్గర దానికి సంబంధించిన కాపీ ఉందన్నారు జోషి తరపు న్యాయవాది.
అసెంబ్లీలో పెడితే ప్రజాప్రతినిధుల దగ్గర ఉండాలి కానీ, మీ దగ్గరికి ఎలా వచ్చిందని ప్రశ్న లేవనెత్తింది. వెబ్సైట్లో ఉందని జవాబు ఇచ్చారు న్యాయవాది. గతంలో వెబ్సైట్ నుండి రిపోర్ట్ తొలగించాలని తాము ఆదేశాలు ఇచ్చామని, మీకు కమిషన్ రిపోర్ట్ ఎలా వచ్చిందని మరోసారి ప్రశ్నించింది. రిపోర్ట్ మీకు ఎలా వచ్చిందో చెప్పాలనీ జోషి న్యాయవాదిని మరోసారి ప్రశ్నించింది.
ALSO READ: ఆ బడా నేతల గుట్టు రట్టు చేసిన కవిత, త్వరలో మరికొందరి జాతకాలు?
సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. ఎలాంటి నోటీసులు తనకు ఇవ్వలేదని తెలిపిన న్యాయవాది, 8బి, 8సి నోటీసులు ఇవ్వకుండానే నిందలు మోపి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. సిబిఐ దర్యాప్తు మీద మీరు ఎందుకు అడుగుతున్నారని, మీ పిటిషన్లో సీబీఐ అంశం లేదు కదాని ప్రశ్నించింది.
మీకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎలా వచ్చిందో ముందు చెప్పాలని కోరింది. ఆ రిపోర్ట్ ఎలా వచ్చిందో అఫిడవిట్ దాఖలు చేయాలని జోషి న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాము వెబ్సైట్లో రిపోర్ట్ అప్లోడ్ చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు ప్రభుత్వ న్యాయవాది.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించింది. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.