CP Sajjanar: స్వేచ్ఛ బ్యూరో: ఎండాకాలం సెలవులంటే ఇంతకు ముందు పిల్లలకు పండుగే. రోజంతా దోస్తులతో కలిసి గోటీలు.. లట్టులు.. గిల్లీ దండా.. క్రికెట్ ఆడటం సరదా. ఊర్లకు వెళ్లి బావుల్లో ఈతలు కొట్టటం.. తాతా, అమ్మమ్మల వద్ద కూర్చొని కథలు చెప్పించుకుని వినటం.. చెప్పాలంటే గోల్డెన్ డేస్. ప్రస్తుత జెన్ జీలో చాలా మందికి ఈ అనుభవాలే ఉండటం లేదు. కారణాలు ఏవైనా చాలా మంది కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వీటితోనే సమయం గడుపుతున్నారు తప్పితే గడప దాటటం లేదు. త్వరలోనే వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో ఇదే విషయాన్ని చెప్పిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ పిల్లలకు టైం కేటాయించండి అంటూ తల్లిదండ్రులకు సూచించారు.
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వినియోగం మితిమీరితే అది పిల్లల భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం ఉండేదన్నారు. నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు సమయాన్ని కేటాయించలేకపోవడం వల్లే వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల పిల్లలు తీవ్రమైన ఒంటరితనానికి గురవుతున్నారన్నారు. పిల్లలు సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని చెప్పారు.
Also Read: CM Revanth Reddy: పేదవాడి పళ్లెంలో సన్న బియ్యం.. దేశంలోనే తెలంగాణ ఆదర్శం
చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయంటూ ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయని అన్నారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అన్న అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో వారికి కొండంత భరోసానిస్తూ, ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలని కోరారు. తల్లిదండ్రుల అప్రమత్తతే బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని చెప్పారు.
Also Read: గద్వాల కాంగ్రెస్లో ముగ్గురు మొనగాళ్లు.. అందరి చూపు అటువైపే..!