Hyderabad Ground Water: హైదరాబాద్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచి నీరని చెప్పి.. విషాన్ని తరలిస్తున్నారు. ఇదే సమయంలో.. నగరంలో భూగరభ జలాల నాణ్యతపైనా చర్చ మొదలైంది? అసలు.. హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? ప్రైవేటు వ్యాపారులు.. ట్యాంకర్లలో విషాన్ని సప్లై చేస్తున్నారా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నదేంటి?
హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు సురక్షితమేనా?
గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ జలాల నాణ్యత, ప్రైవేట్ ట్యాంకర్ల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కొన్ని నివేదికల్లో బయటపడ్డ అంశాలు, హైడ్రా ల్యాబ్ రిపోర్టుల్లో తేలిన అంశాలతో.. పరిస్థితులు ఆందోళనకరంగా మారాయ్. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయని.. కొన్ని నివేదికలు సూచిస్తున్నాయ్. పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ఉన్న చెరువులు, నాలాల నుంచి కాలుష్య కారకాలు, భూగర్భంలోకి చేరి.. నీటిని విషంగా మారుస్తున్నాయ్.
ప్రైవేట్ వ్యాపారులు.. ట్యాంకర్లలో విషాన్ని సప్లై చేస్తున్నారా?
కొన్నాళ్లుగా.. మాదాపూర్లోని సున్నం చెరువు సమీపంలోని కలుషిత బోరుబావుల నుంచి నీటిని తోడి.. ప్రజలకు విక్రయిస్తున్న వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లపై హైడ్రా.. పోలీసు కేసులు నమోదు చేసింది. ఇదే సమయంలో ఈ ఏడాది మొదట్లో జరిపిన రెండు రీసెర్చ్లు.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరం, సిటీ శివారు ప్రాంతాల్లోని బోరు బావుల నుంచి తీసిన భూగర్భజలాల్లో.. తీవ్ర కాలుష్యాన్ని గుర్తించాయి. రెండు రీసెర్చ్ల్లోనూ.. 45 శాతానికి పైగా నీటి నమూనాల్లో నైట్రేట్లు, ఫ్లోరైడ్, ఉప్పు శాతం లాంటివన్నీ.. పరిమితులకు మించిపోయి ఉన్నాయి. దాంతో.. హైదరాబాద్ సహా శివార్లలోని భూగర్భ జలాలు.. తాగడానికి పనికిరాకుండా ఉన్నాయని తేలింది.
వేలాది కుటుంబాలు బోరుబావులపై ఆధారపడి ఉన్నాయ్
ఇటీవల.. అల్వాల్, కాప్రా, కొంపల్లి లాంటి ప్రాంతాల్లో.. వర్షాలకు ముందు, తర్వాత సేకరించిన 48 బోరుబావుల నీటి నమూనాలను కొందరు విశ్లేషించారు. వీటిలో.. ఫ్లోరైడ్ సాంద్రత.. లీటర్ నీటిలో మిల్లీ గ్రాముగా ఉంది. నైట్రేట్ లెవెల్స్.. లీటరుకు 209 మిల్లీగ్రాములుగా ఉంది. సోడియం కూడా అధికంగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ నీరు.. ఇంటి అవసరాలతో పాటు వ్యవసాయానికి కూడా పనికిరాదని చెబుతున్నారు. ఒక్క మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే.. వేలాది కుటుంబాలు బోరుబావులపై ఆధారపడి ఉన్నాయ్. నిజానికి.. భూగర్భజలాలు శుద్ధి చేసిన నీటి కంటే బాగుంటాయని అంతా అనుకుంటారు. కానీ.. దీర్ఘకాలికంగా ఈ నీటిని తాగడం వల్ల.. ఆరోగ్యంపై తీవ్రమైన దుష్పలితాలుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు రావొచ్చని.. ఈ పరిశోధనలు చెబుతున్నాయ్.
సిటీలో భూగర్భ జలాలు.. తక్కువ నాణ్యతతో ఉన్నాయి
ప్రధానంగా వ్యవసాయ వ్యర్థాలు, లీకైన మురుగునీటి వ్యవస్థలు, శుద్ధి చేయని మురుగునీరు, భూగర్భ కారకాలతో.. భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయ్. అయినప్పటికీ.. భూగర్భజలాల నాణ్యతపై సాధారణ పరీక్షలు, వార్డు స్థాయి సమాచారం కోసం ఎలాంటి వ్యవస్థ లేదు. హైదరాబాద్లో భూగర్భజలాలపై ఆధారపడటం పెరిగింది. ఇది.. ప్రైవేట్ ట్యాంకర్ల వినియోగాన్ని పెంచింది. గత వేసవిలో.. వాటర్ ట్యాంకర్లు నెలకు 2 లక్షల ట్రిప్పులు నడిచాయి. అనేక బోరు బావులు లోతుగా ఉండటం, మరింత కలుషితమైన భూగర్భజలాలను తాకాయి. దాంతో.. దీనిని వెంటనే నిర్మూలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయ్. సిటీలో చాలా వరకు భూగర్భ జలాలు.. తక్కువ నాణ్యతతో ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల తాగటానికి పనికిరాకుండా ఉన్నట్లు తేలింది.
Also Read: యవ్వనమే ప్రాణం తీసిందా? షెఫాలీ మరణం వెనుక అసలేం జరిగింది?
నీటిలో.. సీసం, కాడ్మియం, నికెల్ లాంటి లోహాలు..
హైదరాబాద్ జనాభా పెరుగుతుండటం, నిర్మాణ రంగం విస్తరణతో.. బోరు బావుల వాడకం విపరీతంగా పెరిగింది. ఇది.. భూగర్భ జలాల మట్టాలను తగ్గించడమే కాదు.. కాలుష్య కరాకలు నీటిలో చేరేందుకు కారణవుతోంది. భూగర్భ జలాల వినియోగం, పర్యవేక్షణపై సరైన నియంత్రణ లేకపోవడం వల్ల.. అక్రమ బోరుబావులు, నీటి సరఫరా వ్యాపారం పెరిగిపోయింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు మాదాపూర్ సున్నం చెరువు లాంటి అత్యంత కలుషితమైన చెరువుల సమీపంలో అక్రమ బోరుబావులు తవ్వి.. ఆ కలుషిత నీటిని ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నివాస ప్రాంతాలకు, హాస్టళ్లకు, విద్యార్థుల వసతి గృహాలకు సరఫరా చేశారు. ఈ నీటిలో.. సీసం, కాడ్మియం, నికెల్ లాంటి లోహాలు.. మోతాదుకి మించి ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు.. హైడ్రా పరీక్షల్లో తేలింది. అందువల్ల.. అక్రమ బోరుబావులు, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై దృష్టి పెట్టాలనే సూచనలు వినిపిస్తున్నాయ్.