Hyderabad: కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి రైల్వే ట్రాక్కు అడ్డంగా కారును వదిలేసి వెళ్లడం సంచలనంగా మారింది. ఆగంతుకుడు కారును ట్రాక్పై వదిలేసి వెళ్లిపోవడంతో రైల్వే అధికారులు, పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రైల్వే ట్రాక్ సమీపంలో ఆంక్షలు విధించారు.
కారులో ఏమైనా అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు ఉండవచ్చన్న అనుమానంతో బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. నిపుణులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ కారు “బాలాజీ” అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు గుర్తించారు. కారును ఎవరు వదిలి వెళ్లారు, దీని వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాచిగూడ నింబోలి అడ్డా రైల్వే అండర్పాస్ సమీపంలో అనుమానాస్పదంగా పార్క్ చేసిన కారు కలకలం సృష్టించిన ఘటనపై పోలీసులు స్పష్టతనిచ్చారు. ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని, తాగిన మైకంలో ఓ వ్యక్తి చేసిన పనిగా తేల్చారు.
ఈస్ట్ జోన్ డీసీపీ బి. బాలస్వామి ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. రైల్వే అండర్పాస్ సమీపంలో అనుమానాస్పదంగా కారు పార్క్ చేసి ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు.
తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, ఇతర అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదని డీసీపీ స్పష్టం చేశారు. దర్యాప్తులో, ఆ కారు కాచిగూడకు చెందిన బాలాజీ అనే వ్యక్తిదని, అతని వద్ద నుంచి సమీర్ అనే వ్యక్తి కారు తీసుకువెళ్లినట్లు తేలిందన్నారు. సమీర్ మద్యం మత్తులో కారును అక్కడ పార్క్ చేసి వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా వస్తువు గానీ, వ్యక్తులు గానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ బాలస్వామి విజ్ఞప్తి చేశారు.
Read Also: Pune Accident: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి