Hyderabad News : నిత్యం రద్దీతో కితకితలాడే హైదరాబాద్ రహదారులపై మద్యం బాబులు దర్జాగా తిరిగేస్తున్నారు. రోడ్లపై ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లోనూ మందు తాగేసి ఎంచక్కా బండ్లు నడిపేస్తున్నారు. పోలీసులు వారిస్తున్న, ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ.. మందుబాబులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా తమ దారిని మాత్రం మార్చుకోవటం లేదు. గత మూడు నెలలుగా నగరంలో నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ.
హైదరాబాద్ లో ఆగస్టు 24 నుంచి నవంబర్ 21 వరకు మూడు నెలల్లో నగరంలో పట్టుబడిన వారి సంఖ్య ఏకంగా 14 వేల మంది కావడం గమనార్హం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రద్దీ సమయాల్లో విస్తృతంగా మద్యం తనిఖీలు చేపడుతున్న పోలీసులు 13,188 మందిపై కేసులు నమోదు చేసి.. కోర్టులకు పంపించారు. వీరిపై ఛార్జిషీట్లు సైతం దాఖలు చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు.
మద్యం కేసుల్లో గత మూడు నెలల్లోనే మొత్తం 824 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులకు హాజరుపరచగా.. ఒకటి నుంచి పది రోజుల పాటు సామాజిక సేవ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరో 25 మందికి రెండు రోజులు పాటు సామాజిక సేవ చేయాల్సిందిగా ఆదేశించింది.అతిగా మద్యం సేవించిన కేసుల్లో 89 మంది లైసెన్సుల్ని రెండు నుంచి ఆరు నెలలు సస్పెండ్ చేయాల్సిందిగా ఆర్డీవోకు కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి.
ఇందుకు గాను వివిధ స్థాయి కేసులులో ఉల్లంఘనలకు న్యాయస్థానం రూ.2 కోట్ల 87 లక్షల 20 వేల 600 జరిమానాగా విధించింది. మద్యం మత్తులో జరుగుతున్న వాహన ప్రమాదాలు పెరుగుతున్న తరుణంలో పోలీసులు నగరవ్యాప్తంగా అనేకచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. ఇలా నవంబర్ 9న చేపట్టిన తనిఖీల్లో ఒకేరోజు ఏకంగా 327 మంది పరిమితం మించి మద్యం సేవించి.. తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరందరికీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులకు పంపించారు.
పరిమితికి మించి మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 60 % – 70 % వరకు ద్విచక్ర వాహనాల ప్రమాదాలే కావడం గమనార్హం. పోలీసులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొత్తం నమోదైన 14,000 కేసుల్లో 11,900 మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడిస్తున్నారు.
Also Read : BJP – indiramma indlu scheme : ఇందిరమ్మ కమిటీలకు రైట్.. రైట్
మందు తాగి పోలీసులకు చిక్కిన వారిలో 630 మంది రక్తంలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఏకంగా 200 దాటినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఇలా మోతాదుకు మించి మందు తాగేవారిని అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడుతున్న వారికి గోషామహల్, బేగంపేట్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రాల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. వీరంతా మరోసారి ఇలాంటి పొరపాట్లకు పాల్పడకుండా.. కుటుంబ సభ్యుల సమక్షంలో నగర ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అతిగా మద్యం సేవించి రోడ్లపైకి వస్తే జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.