తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిపోయిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా జేఎల్ఎల్–రూఫ్అండ్ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణె నగరాలలో 2,500 మంది కస్టమర్లతో ఇటీవల జేఎల్ఎల్, రూఫ్ అండ్ ఫ్లోర్ సంస్థలు సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. అందులో కొన్ని కీలక అంశాలు వెలుగు చూశాయి. వచ్చే మూడు నెలల్లో 80 శాతం కంటే ఎక్కువ మంది నూతన గృహాలను కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారట. వారంతా రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సిద్ధంగా ఉన్నారట. హైదరాబాద్ సహా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్లకు డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది.
పెరుగుతున్న విలువ..
2023లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిజిస్టర్ అయిన ఇళ్ల సంఖ్య 71,912. 2024లో వీటి సంఖ్య 7 శాతం పెరిగింది. అంటే 2024లో మొత్తం 76,613 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక్కడే చిన్న విశేషం ఉంది. పెరిగిన శాతం తక్కువే అయిన విలువలో మాత్రం భారీగా మార్పు ఉంది. 2023లో రిజిస్టర్ అయిన ఇళ్ల విలువ రూ.38,395 కోట్లు కాగా, 2024లో రిజిస్టర్ అయిన ఇళ్ల విలువ 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లుగా ఉంది. 50లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న ఇళ్ల కొనుగోళ్లు కాస్త తగ్గాయి. అదే సమయంలో రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్న ప్రాపర్టీల వాటా గణనీయంగా పెరిగింది. సో ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి, అదే సమయంలో ఇళ్లకోసం కస్టమర్లు వెచ్చించే సొమ్ము కూడా పెరుగుతోంది.
కొత్త మోడల్స్..
కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్, ఆన్ లైన్ క్లాస్ల అవసరం అందరికీ ఏర్పడింది. దీంతో ఇళ్ల నిర్మాణంలో కొత్త మోడల్స్ కి అవకాశం వచ్చింది. తమ అవసరాలకోసం ఫ్లోర్ ప్లాన్స్ లో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలాన్ని పూర్తిగా ఖాళీగా వదిలి పెట్టాలనుకోవడం లేదు. అక్కడ అదనంగా ఒక గదిని నిర్మించమని కోరుతున్నారట. అది పూర్తిగా ఐసోలేషన్ గదిలా ఉండాలని అడుగుతున్నారట. ఇక్కడ ఆఫీస్ వర్క్ లేదా, ఆన్ లైన్ క్లాస్ వినడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.
కరోనా తర్వాత ఆఫీస్ లో కంటే ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారంతా. దీంతో ఇంటి కొనుగోలులో ఎవరూ రాజీపడటం లేదు. ఫైనాన్షియల్ గా రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పరిస్థితులతో రాజీపడి చిన్న సైజు ఇల్లు తీసుకోవడం కంటే, విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని కోరుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరితో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని కోరుకునేవారి సంఖ్య కూడా పెరిగింది. గతంలో ఇంటి సైజ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకునే జనరేషన్ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఇంటి విస్తీర్ణంలో ఎవరూ రాజీ పడటం లేదని సర్వే చెబుతోంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో విల్లాలు, డెవలప్ చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటంతోపాటు, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో రియల్ బూమ్ తగ్గిందనేది వట్టి కల్పిత ప్రచారం అని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. హైదరాబాద్ రియల్ బూమ్ పడిపోలేదని, పైగా పెరుగుతోందని, సర్వేలో పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.