Voter Revision: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణతో పాటు బోగస్ ఓట్ల ఏరివేతకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం నుంచి నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ తొలి రోజే తుస్సుమంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు, ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్దం చేశామని, గురువారం నుంచి నగరంలోని 43 లక్షల పై చిలుకు ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లు, వివిధ పార్టీల నుంచి నియమితులైన బూత్ లెవెల్ ఏజెంట్లకు తగిన శిక్షణ కూడా ఇచ్చామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రకటించినా, సర్ తొలి రోజు ప్రక్రియ అధికారులు ఆశించిన స్థాయిలో జరగలేదు. జూబ్లీహిల్స్, నాంపల్లి, పాతబస్తీలో చాంద్రాయణగుట్ట మినహా మిగిలిన నియోజకవర్గాల్లో మధ్యాహ్నాం వరకు కూడా ఎన్యుమరేషన్ ఫారాలు రాకపోవటంతో ఏజెంట్లు వేచి చూసి, మరి కొన్ని చోట్ల పడిగాపులు కాసి, మధ్యాహ్నాం ఇంటికి వెళ్లిపోయిన సంఘటనలున్నాయి.
సనత్ నగర్ నియోజకవర్గంలో ఉదయం పది గంటల నుంచి సర్ ప్రక్రియను బూత్ లెవెల్ ఆఫీసర్లు తగినన్ని ఫారాలు తీసుకువచ్చి, ఓటర్లకు పంపిణీ చేసి, వాటిని పూరించే విధానాన్ని కూడా వివరించారు. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, గోషామహాల్ నియోజకవర్గంలోని కొన్ని వార్డుల్లో కూడా సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటి పారాలు పంపిణీ చేసే కార్యక్రమం కాస్త ఆలస్యంగా మొదలైనా, సాయంత్రం అయిదు గంటల వరకు ఫారాలు పంపిణీ చేశారు. నాంపల్లి నియోజకవర్గంలోని అహ్మద్ నగర్, గోషామహాల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు కొన్ని ఫారాలు తీసుకువచ్చి, ఎలా పూరించాలో వివరిస్తూ ఫారాలు పూర్తి స్థాయిలో సోమవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పి, వెళ్లిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. మరి కొన్ని చోట్ల సర్ ప్రక్రియ కింద ఫారాలను కొందరు అధికారేతర ప్రముఖుల చేత పంపిణీ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి.
స్పెషల్ ఇంటెన్వివ్ రివిజన్ (సర్ ) ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న వచ్చే నెల 24 వరకు ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ నెల రోజుల్లో ఒక్కో ఇంటిని మూడు సార్లు సందర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేసినప్పటికీ, తొలి రోజైన గురువారం బూత్ లెవెల్ ఆఫీసర్లు ఒక్క ఇంటిని కూడా సందర్శించని ప్రాంతాలున్నాయి. పైగా ఒక పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లకుండా కమ్యూనిటీ హాళ్లలో కౌంటర్లను ఏర్పాటు చేసి, ఓటరు జాబితా, ఫారాలు అక్కడే అందుబాటులోకి పెట్టి, బస్తీ పెద్దలతో ఓటర్లనే కమ్యూనిటీ హాళ్లకు పిలిపించుకుని, ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) ప్రక్రియలో భాగంగా కొద్ది రోజుల ముందు 46 శాతం వరకు మాత్రమే మ్యాపింగ్ చేసిన ఎన్నికల విభాగం అధికారులు గురువారం కొన్ని చోట్ల బూత్ లెవెల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లకు మ్యాపింగ్ చేసుకుని, సోమవారం నుంచి ఫారాలు పంపిణీ చేస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు ఓటర్లు వెల్లడించారు.
Also read; రేవంత్ ‘డైనమిక్ లీడర్’.. తెలంగాణ హక్కులపై రాజీపడరు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా 2002లో చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఓటర్లకు కేటాయించిన నెంబర్లను కొత్తగా పంపిణీ చేయనున్న ఎన్యుమరేషన్ ఫారంలో రిఫరెన్స్ గా పొందుపర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఒక్కో కుటుంబంలోని ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు మరో మూడు రకాల ఫారాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఇటీవలే వెల్లడించిన సంగతి తెల్సిందే. బూత్ లెవెల్ ఆఫీసర్లు జారీ చేయాల్సిన ఫారాల్లో ఫారం-6,ఫారం-7, పారం-8 లు కూడా ఉన్నాయి. వీటిలో ఫారం-6 ను 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదు కోసం కాగా, ఫారం-7 ను డబుల్ గా ఉన్న ఓట్లలో ఒక ఓటును తొలగించేందుకు వినియోగిస్తుండగా, ఫారం-8 ని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటరు అదే నియోజకవర్గంలోని వేరే ప్రాంతానికి తన ఓటును మార్చుకునేందుకు వినియోగిస్తుంటారు.
సర్ మొదలైన నాటి నుంచి చివరి రోజుకు ఒక రోజు ముందు అంటే వచ్చే నెల 23 వరకు ఎన్యుమరేషన్ ఫారంతో పంపిణీ చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెప్పినా, మొదటి రోజైన గురువారం కావల్సిన సంఖ్యలో ఫారాలు అందుబాటులో లేకపోవటంతో పలు నియోజకవర్గాల్లో బీఎల్ఓలు కొన్ని కుటుంబాలకే ఫారాలు పంపిణీ చేసి, తిరిగి సోమవారం పంపిణీ చేస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆరా తీయగా, ఫారాల ప్రింట్ ప్రక్రియ కొనసాగుతుందని, శుక్రవారం సెలవు రోజు కావటంతో శనివారం సాయంత్రం గానీ, 29వ తేదీ సోమవారం ఉదయం వరకు గానీ కావల్సిన సంఖ్యలో ఫారాలు సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో 2002 సర్ వరుస సంఖ్యలో లింకు చేస్తున్నందున రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గురువారం మొదటి రోజు కావటంతో ఇప్పటికే బీఎల్ఏలుగా నియమితులైన వివిధ పార్టీలకు చెందిన నేతలు తామే ఓటర్లకు ఫారాలు జారీ చేసి, వారి వివరాలకు తాము ఇప్పటికే సేకరించిన 2002 సర్ వివరాలను జోడించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ కావల్సినంత సంఖ్యలో ఫారాలు అందుబాటులో లేకపోవటంతో కొందరు మాజీ కార్పొరేషన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఎలక్షన్ వింగ్ అధికారులకు ఫోన్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సర్ 2002 లోని వివరాలను సమర్పించకుంటే ఓటు తొలగించే అవకాశాలుండటంతో కొన్ని పార్టీలు ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లకు సంబంధించిన 2002 సర్ వివరాలను సేకరించి, సమర్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెల్సింది.