Indian Army Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనగానే వెంటనే గుర్తొచ్చేది గర్జించే శబ్దం, బలమైన లుక్. అందుకే చాలా మంది ఈ బైక్ ను ఇష్టపడుతారు. ఇక ఈ మోటార్ సైకిల్ తో భారత సైన్యానికి ఉన్న అనుబంధం గురంచి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దశాబ్దాలుగా సైనికుల ప్రయాణంలో భాగమైన బుల్లెట్.. సైనిక వారసత్వానికి ఒక గుర్తుగా మారిపోయింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైనికుల కవాతు, ఆయుధ ప్రదర్శనలతో పాటు మోటార్సైకిళ్లపై జరిగే సాహస ప్రదర్శనలు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై సైనికులు చేసే విన్యాసాలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఈ బైక్కు సైన్యంతో ఉన్న అనుబంధం 70 ఏళ్ల క్రితమే మొదలైంది.
భారత సైన్యానికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్తో సంబంధం 1952లో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. 1947-48 భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో సైనికుల రాకపోకలకు సరైన వాహనాల అవసరం మరింత పెరిగింది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో రహదారులు అంతగా అభివృద్ధి చెందలేదు. మంచు, భారీ వర్షాలు, కఠినమైన వాతావరణం మధ్య కూడా పనిచేయగల వాహనం సైన్యానికి అవసరమైంది.
ఈ సమయంలో బుల్లెట్ 350 సైన్యానికి సరిపోయే మోటార్సైకిల్గా కనిపించింది. దీని బలమైన నిర్మాణం, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, మంచి సస్పెన్షన్ లాంటి ఫీచర్లు కఠినమైన ప్రాంతాల్లో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా పెద్దగా క్లిష్టంగా ఉండకపోవడంతో సైనిక అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు భావించారు. చాలా పరీక్షలు జరిపిన తర్వాత 1952లో భారత ప్రభుత్వం 800 బుల్లెట్ 350 మోటార్ సైకిళ్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ బైక్లు 1953లో భారత్కు చేరాయి. ఆ తర్వాత సైన్యం ఉపయోగించే వాహనాల్లో బుల్లెట్కు ప్రత్యేక స్థానం ఏర్పడింది.
ప్రారంభంలో బుల్లెట్ బైకులు బ్రిటన్ నుంచి భారత్కు దిగుమతి చేసుకునేవారు. అయితే, సైన్యంతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ బైక్కు డిమాండ్ పెరగడంతో దేశంలోనే తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. 1955లో రాయల్ ఎన్ఫీల్డ్ బ్రిటన్, మద్రాస్ మోటార్స్ తో కలిసి చెన్నైలోని తిరువొత్తియూర్లో ఎన్ఫీల్డ్ ఇండియాను ఏర్పాటు చేసింది. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన విడిభాగాలతో బైక్లను ఇక్కడ అసెంబుల్ చేసేవారు. తర్వాత తయారీ ప్రక్రియ క్రమంగా భారత్లోనే పూర్తిగా జరిగే స్థాయికి చేరుకుంది. 1962 నాటికి బుల్లెట్ తయారీ మొత్తం భారత్కు మారింది. ఆ తర్వాత కాలంలో బ్రిటన్లో రాయల్ ఎన్ఫీల్డ్ కార్యకలాపాలు నిలిచిపోయినా, భారత్లో మాత్రం ఈ బ్రాండ్ కొనసాగింది. కాలంతో పాటు బుల్లెట్ రూపంలో, టెక్నాలజీలో మార్పులు వచ్చినా దాని ప్రత్యేక గుర్తింపు మాత్రం అలాగే నిలిచింది.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సైనిక వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. సైన్యంలోని మోటార్సైకిల్ ప్రదర్శన బృందాలు కూడా దీనిని ఉపయోగించాయి. డేర్డెవిల్స్, టోర్నడోస్ వంటి బృందాలు బుల్లెట్పై చేసే విన్యాసాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కాలం మారడంతో సైన్యం అవసరాలు కూడా మారాయి. ఆధునిక సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా కొత్త మోటార్ సైకిళ్లు, కార్లు, 4×4 వాహనాలు, సాయుధ వాహనాలు సైన్యంలోకి వచ్చాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, క్లాసిక్ సిరీస్తో పాటు ఇతర సంస్థల మోటార్సైకిళ్లు కూడా వివిధ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. కఠిన పరిస్థితుల్లో పనిచేసిన చరిత్ర, సైనికుల నమ్మకం, దేశభక్తి, సాహస ప్రదర్శనలతో కలిసి బుల్లెట్ భారత సైనిక వారసత్వంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!