Medical Tourism: ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జూన్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటకశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మంగళవారం ఆరోగ్య, పర్యాటక శాఖఉన్నతాధికారులతో సెక్రటేరియట్లోని తన చాంబర్లో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, కలిగే ప్రయోజనాలపై చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ లక్ష్యాన్నిఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
ఇకపై ప్రతి సంవత్సరం హైదరాబాద్లో కనీసం ఒక మెడికల్ టూరిజం ఈవెంట్ను నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారని, ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది జూన్లో మొదటి ఈవెంట్ నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ఈవెంట్లో దేశ, విదేశీ వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. మెడికల్ టూరిజంలో ఉన్న ప్రైవేటు సంస్థలను సైతం ఈవెంట్లో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
Also Read: జియో, ఎయిర్టెల్, BSNL.. రూ.200లోపు బెస్ట్ ప్లాన్స్ ఇవే.. బోలెడన్ని లాభాలు భయ్యా!
ఆఫ్రికా, ఏసియా, మిడిల్ ఈస్ట్ తదితర కంట్రీస్ నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్తో పాటు.. నిమ్స్, టిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ హాస్పిటళ్ల సందర్శనకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న 3 టిమ్స్ హాస్పిటల్స్లో ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఒక్కో హాస్పిటల్లో 50 బెడ్లతో ఇంటర్నేషనల్ పేషెంట్స్ వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also Read: ఓరి దేవుడా.. మే నెలలో ఇన్ని అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయా? మెుబైల్ ప్రియులకు పండుగే!