Miss World 2025: తెలంగాణను దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దడం, పర్యాటక రంగంలో 15వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఇటీవలే తొలి టూరిజం పాలసీని రూపొందించింది. ఇందుకోసం మిస్ వరల్డ్ పోటీలను సరైన వేదికగా ఉపయోగించుకుంటోంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మే 7 నుంచి మే 31 వరకు జరగనున్న ఈ పోటీలకు 120 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్లో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. తెలంగాణ పర్యాటకాన్ని ప్రమోట్ చేయాలనే లక్ష్యంలో ముందుకెళ్తోంది.
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయం
ప్రపంచ పర్యాటకంలో తెలంగాణను ప్రముఖంగా నిలిపేందుకు, విదేశీ పర్యాటకులను ఆకర్షించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. 2024లో తెలంగాణను 15లక్షల 5వేల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. ఈ సంఖ్యను పెంచేందుకు మిస్వరల్డ్ ఈవెంట్ను ఉపయోగించుకుంటోంది రేవంత్రెడ్డి సర్కార్. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్, వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి, రామప్ప, నాగార్జునసాగర్, పోచంపల్లి, పిల్లలమర్రి వృక్షం వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ సౌత్ ఆఫ్రికా,మిస్ బ్రెజిల్
తెలంగాణలో జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం సుందరీమణుల రాక మొదలైంది. మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ బ్రెజిల్తో పాటు పలు దేశాల అందగత్తెలు హైదరాబాద్లో అడుగుపెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అందగత్తెలకు ప్రభుత్వం సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతం పలికారు. సుందరీమణుల రాకతో శంషాబాద్ ఎయిర్పోర్టులో సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ప్రత్యేకించి అందగత్తెల ఏర్పాట్ల కోసమే టూరిజం శాఖ ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసింది. ప్రయాణ సమయంలో ఎక్కడా వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం నిర్ణయాలు చర్యలు చేపట్టింది.
మిస్ వరల్డ్ వేడుకల్లో ఇండియా చాంపియన్ P.V. సింధు
మిస్ వరల్డ్-2025 వేడుకల్లో తెలంగాణ ఖ్యాతిని పెంచేందుకు P.V. సింధు సైతం ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధం అయ్యారు. అలాగే నిఖత్ జరీన్ కూడా 72వ మిస్ వరల్డ్ ఎడిషన్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మిస్ వరల్డ్ వేడుకలకు సర్వం సిద్ధం అంటూ తెలంగాణ బ్రాండ్గా నిలిచింది. అందగత్తెల పోటీకి 120 దేశాల నుంచి సుందరీమణులు, 150 దేశాల నుంచి మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు
ఉత్సాహభరితమైన సంప్రదాయాలతో, రంగులతో పోటీదారులను హైదరాబాద్ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. పనిలోగా పనిగా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా.. అడుగులు వేస్తోంది. మరో వైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వేదికను ఉపయోగించుకునేలా ప్లాన్ చేసింది. ఈ పోటీల తర్వాత తెలంగాణ ప్రపంచంలో గుర్తుండిపోయే లెవెల్కు వెళుతుందంటూ భావిస్తున్నారు. ఈ పోటీలకు బ్యూటీలు మే8లోపు హైదరాబాద్ చేరుకొని పాల్గొననున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే పోటీలు ఈనెల 31తో ఫైనల్స్ చేరతాయి.
మిస్ వరల్డ్ నిర్వహణతో వేరే లెవెల్కు తెలంగాణ ఖ్యాతి
ఈనెల 12న హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్, లాడ్ బజార్లలలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హెరిటేజ్ వాక్ చేస్తారు. 13న హైదరాబాద్కే తలమానికంగా నిలుస్తున్న చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించి పాతబస్తీ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి తెలియచేస్తారు. ఈ నెల 14న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్లోని వేయి స్తంభాల గుడి, వరంగల్ పోర్ట్ను సందర్శిస్తారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. అదే రోజు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాని కూడా సందర్శిస్తారు. కాకతీయులు యుద్ధ రంగానికి వెళ్లే ముందు ప్రదర్శించే పేరిణి నృత్యంను కూడా తిలకిస్తారు. ఈ నెల 15న యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని చూస్తారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు.
Also Read: రైతులకు ఐడీ కార్డు తప్పనిసరి.. లేకుంటే పథకాలు రావ్
తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు
16వ తేదీన మెడికల్ టూరిజం చేపడతారు. మహబూబ్నగర్లోని పిల్లలమర్రి వృక్షాన్ని, హైదరాబాద్కే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్స్పీరియం పార్క్, 17న రామోజీ ఫిల్మ్సిటీ సందర్శన ఉంటుంది. 18న తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లి.. తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనిషియేటివ్స్ను పరిశీలిస్తారు. ఆ రోజు సాయంత్రం మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్పై ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కార్నివాల్ను సందర్శిస్తారు. ఈనెల 20, 21న ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్కు కంటెస్టెంట్లు హాజరవుతారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్కు కూడా హాజరవుతారు.
మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్గా
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విస్తృత ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్గా నిలిపే అవకాశం లభిస్తుంది అన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన.