Water Supply: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు అలర్ట్. జూలై 6 (సోమవారం) ఉదయం నుండి నగరంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (HMWSSB) చేపట్టనున్న అత్యవసర మరమ్మతు పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. జూలై 6న ఉదయం 6 గంటల నుండి జూలై 7న ఉదయం 6 గంటల వరకు (మొత్తం 24 గంటల పాటు) నీటి సరఫరా బంద్ కానుంది.
కారణం ఇదే..
అల్లాబండ పరిధిలోని 10 ML సామర్థ్యం కలిగిన ప్రధాన రిజర్వాయర్ ఇన్లెట్, అవుట్లెట్ వద్ద ఉన్న పాత బటర్ఫ్లై వాల్వ్లను మార్చాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. నీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, భవిష్యత్తులో లీకేజీల సమస్యలు రాకుండా ఉండటానికి ఈ ఆధునికీకరణ పనులు అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు. దాదాపు ఒక పూర్తి రోజు పాటు ఈ పనులు నిరంతరాయంగా కొనసాగనున్నాయి.
జూలై 6న నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు
ఈ పనుల కారణంగా జూలై 6 నాడు జిర్రా, ఇందిరానగర్, హరి దర్గా, కుమ్మర్వాడి, తప్పాచబుత్రా, ఆకాశ్పురి, షిబ్లీ హిల్స్, బిలాల్ మసీదు ఏరియా, గోడేకి కబర్, జాలి హనుమాన్, జంగూర్ బస్తీ, అబుషతకియా, 2J బస్ స్టాప్, జియాగూడ, కార్వాన్ వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.
జూలై 7న ఇబ్బందులు పడే ఏరియాలు ఇవే..
ఇక మరుసటి రోజు అంటే జూలై 7 (మంగళవారం) నాడు కూడా దీని ప్రభావం కొన్ని ప్రాంతాలపై ఉండనుంది. సబ్జీమండి, గంగానగర్, ఉస్మానియా, శివ్లాల్ నగర్, బెర్హమ్ గల్లీ, గంగామాత, జాలి హనుమాన్, ఆజం గల్లీ, రహీంపురా, పురానాపూల్, చూడీ బజార్, ఉస్మానియా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, శంకర్ బజార్ మరియు జుమ్మేరాత్ బజార్ పరిధిలోని ప్రజలకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది.
ముందస్తు జాగ్రత్తలు అవసరం
24 గంటల పాటు నీటి సరఫరా ఆగిపోనున్న నేపథ్యంలో, పైన పేర్కొన్న ప్రాంతాల ప్రజలు ముందస్తుగానే అవసరమైన మేర నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. సరఫరా పునరుద్ధరించబడే వరకు నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలని, అత్యవసర సేవల కోసం జలమండలి హెల్ప్లైన్ను సంప్రదించవచ్చని కోరారు.
Also Read: అక్కడ రైతులు నాట్లు వేయలేకపోతుంటే.. ఇక్కడ నీటిని వృథా చేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్