భాగ్యనగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న హైడ్రా (HYDRAA) మరోసారి భారీ ఆక్రమణ భూమిని గుర్తించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని టీఎన్జీవో కాలనీలో ఆక్రమణకు గురైన సుమారు 16 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ సుమారు రూ. 3200 కోట్లు ఉంటుందని అంచనా. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ నిర్వహించారు.
గతంలో టీఎన్జీవో ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇక్కడ కొంత భూమిని కేటాయించింది. అయితే 2007 నాటి హెచ్ఎండిఏ (HMDA) లే అవుట్ నిబంధనల ప్రకారం.. ఇందులో 10 ఎకరాల విస్తీర్ణం ముసాయికుంటగా రికార్డుల్లో ఉంది. దీనికి ఆనుకుని ఉన్న మరో 4 ఎకరాల స్థలాన్ని గ్రీన్ బెల్ట్ జోన్ కోసం కేటాయించారు. అలాగే మిగిలిన 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం ప్రత్యేకించారు. ఈ కీలకమైన భూములపై కొంతకాలంగా ఆక్రమణదారుల కన్ను పడింది. కొందరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సైతం ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై బాధితులు స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా విభాగం లోతుగా విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. రికార్డుల ప్రకారం ఆ 16 ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని స్పష్టమవ్వడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆక్రమణలను తొలగించి మొత్తం భూమి చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని.. ఇక్కడ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ భారీ నోటీసు బోర్డులు పాతారు.
కుంటలు గ్రీన్ బెల్ట్ ఏరియాలను కాపాడటంలో హైడ్రా ప్రదర్శించిన చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి అక్రమ కట్టడాలు ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించాలని నగరవాసులు కోరుతున్నారు.