Illegal Constructions: చర్యలు తీసుకోలేక గమ్మునుంటున్న అధికారులు
– హైడ్రా వచ్చినా ఈ నిర్మాణాలపై దృష్టి ఎందుకు సాధించడం లేదంటూ స్థానికుల ప్రశ్న
– ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న స్థానికులు
రాజేంద్రనగర్, స్వేచ్ఛ: నార్సింగి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణదారులు బరితెగిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సహకరిస్తుండటంతో ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలను చేపడుతున్నారు. అడ్డుకునేవారు లేకపోవడంతో తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలను నిర్మిస్తున్నారు. అడ్డుకునేందుకు ఎవరైనా అధికారులు వెళితే వారిపై ఒత్తిళ్లు కలిగిస్తున్నారు. ఇక ధైర్యం చేసి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వారిపై బెదిరింపులే కాకుండా భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారు. వివరాల ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ లో 250 గజాలలో జి ప్లస్ 2 అనుమతులు తీసుకొని జి ప్లస్ 7, జి ప్లస్ 8 నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఒత్తిళ్లకు చల్లబడుతున్నారు. ప్రజాప్రతినిధులు సహకరిస్తుండటంతో నిర్మాణాదారులు రెచ్చిపోయి నిర్మాణాలను చేపడుతున్నారు. ఆకాశాన్నంటేలా నిర్మాణాలు చేపడుతూ స్థానికంగా భయాందోళనలకు గురి చేస్తున్నారు.
ఈ నిర్మాణాలను గుర్తించి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వారిపై భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా సమాచారం. కాగా ప్రజాప్రతినిధుల సహకారమే ఈ నిర్మాణాలకు అండగా ఉంటుండడంతో ఎవరు ఏమి చేయడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పేక మేడల లాంటి నిర్మాణాలు చేపడుతుంటే ఆ నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయో లేవో తెలియని పరిస్థితులు స్థానికంగా గోచరిస్తున్నాయి. కనీస నిబంధనలైన సెట్ బ్యాక్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపించడం లేదు. చెరువులలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా(Hydraa) వచ్చినప్పటికీ ఈ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే స్థానికంగా మరిన్ని అక్రమ నిర్మాణాలు నిర్మించే అవకాశాలు లేకపోలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Kesineni Chinni on YCP: వైసీపీ ఒక ‘నకిలీ పార్టీ’.. జగన్ కుట్రలు సాగవు.. కేశినేని చిన్ని ఫైర్!
నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం కేవలం పేపర్ల పరిశీలనకే పరిమితం అవుతూ పనిచేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వారిపై వస్తున్న ఒత్తిల్లే ఇందుకు కారణమా లేక వారు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ మామూళ్లు తీసుకుంటున్నారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మౌనంగా ఉండడమే స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు కర్త, కర్మ, క్రియ అంతా తామే అన్నచందంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులను సైతం అడ్డగిస్తూ పైరవీలతో నాయకుల మాట నెగ్గించుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రజా ప్రతినిధులే అక్రమాలకు తెగబడే వారికి సహకరిస్తే తాము ఎవరికి చెప్పుకోవాలంటే స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాదారులు ఇచ్చే తాయిలాలకు లొంగిపోయి ప్రజాప్రతినిధులు ఇలా చేస్తున్నారంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు తెలిపినా నిర్మాణాలను మాత్రం ఎవరు అడ్డుకోవడం లేదు. ఇదే ధైర్యంతో నిర్మాణాదారులు రెచ్చిపోయి నిర్మాణాలను చేపడుతుండడం గమనార్హం.
Also Read: Maoists Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. మరో నలుగురు లొంగుబాటు