Telangana Global Summit: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047లో.. అత్యంత ఆకర్షణీయమైన స్టాల్స్లో ఒకటిగా ‘ఇందిరా మహిళా శక్తి’ ప్రత్యేకంగా నిలుస్తోంది. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను, మహిళల సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించే ముఖ్య వేదికగా ఈ స్టాల్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ (SERP)మహిళా శిశు సంక్షేమ శాఖసంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్టాల్, దేశ, విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంటోంది.
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రతను పెంపొందించడానికి తీసుకున్న పథకాలు, వాటి అమలు విధానం, గ్రామీణ మహిళలు సాధించిన విజయాలు అన్ని కలిసి ఈ స్టాల్ను తీర్చిదిద్దారు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఎలా శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాయో.. ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశాన్ని సమిట్ సందర్శకులకు అందిస్తోంది.
ఈ స్టాల్లో మహిళల ఆర్థిక శక్తి పెంపొందింపునకు తీసుకున్న.. వివిధ కార్యక్రమాల మోడల్స్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ముఖ్యంగా మహిళల చేత పెట్రోల్ బంకుల విజయవంతమైన నిర్వహణ, హైటెక్ సిటీలో నడుస్తున్న ‘ఇందిరా మహిళా శక్తి బజార్’లో మహిళల వ్యాపార ప్రతిభ, జిల్లాల వ్యాప్తంగా నిర్మించిన మహిళా శక్తి భవనాల వినియోగం, ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ల సమర్థవంతమైన నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో మహిళా సంఘాల అద్భుత విజయాలు, పరిచయం చేస్తూ, మహిళలు కేవలం కుటుంబ పరిమితుల్లో కాక, సమాజ, ఆర్థిక రంగాల్లో కూడా ఎలా ముందుకు వస్తున్నారో చూపిస్తున్నారు.
స్టాల్ను సందర్శించే వారికి మహిళా సంఘాల విజయం మీద ఆధారపడి రూపొందించిన పలు డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ స్వంత వ్యాపారాల ద్వారా ఎలా ఆర్థికంగా ఎదిగి, కుటుంబాలను నిలబెట్టారో చూపించే ఈ వీడియోలు దేశ విదేశీ ప్రతినిధులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
అలాగే, మహిళా శిశు సంక్షేమ శాఖ కొత్తగా చేపట్టిన పథకాలకు సంబంధించిన ఫోటోలు, సమాచార బ్యానర్లు, ఇంటరాక్టివ్ డిస్ప్లేల ద్వారా రాష్ట్రంలో నడుస్తున్న మహిళా సంక్షేమ కార్యక్రమాల వివరణను అందిస్తున్నారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని.. అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో వేల కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలు, మహిళా సంఘాలకు వందల కోట్ల వడ్డీ చెల్లింపులు, ప్రతి మహిళా సభ్యురాలికి రూ. 10 లక్షల లోన్ భీమా, రూ. 2 లక్షల ప్రమాద బీమా, 20కిపైగా వ్యాపార రంగాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహించడం, ఈ పథకాలు మహిళలు ఆర్థికంగానూ, సామాజికంగానూ మరింత బలపడేలా దోహదపడుతున్నాయి.
Also Read: ఏకగ్రీవానికి వేలం పాట.. 35 మందిపై కేసు నమోదు
రైజింగ్ గ్లోబల్ సమిట్ను సందర్శించిన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్ను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. స్టాల్లో ప్రదర్శించిన వ్యాపార నమూనాలు, నిర్వహణ పద్ధతులు, మహిళల భాగస్వామ్యం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ మహిళల వరకు ఈ పథకాలు ఎలా చేరుతున్నాయో, వారి జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకువస్తున్నాయో తెలుసుకునేందుకు ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.