Indiramma Housing Scheme : రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన మంత్రి.. వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని.. చివరి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరే వరకు ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర పథకాలకు కూడా నిధులు అందుబాటులో ఉంచాల్సిన నేపథ్యంలో.. ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా నిర్మిస్తామని ప్రకటించారు. మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ప్రకటించారు. రెండో దశలో ఇళ్ల స్థలం కూడా లేని నిరుపేదలకు.. స్థలంతో పాటుగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు, గ్రామాలలో రెవెన్యూ వ్యవస్ధ, సర్వేయర్ల నియామకంపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం నాడు.. చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారితో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వి.పి. గౌతమ్, జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి, సీఎంఆర్వో డైరెక్టర్ మకరంద్ వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ విభాగాన్ని సమకూర్చుకోవడం, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకం, సర్వేయర్ల నియామకంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో.. ప్రతీ గ్రామంలో ఇళ్ల స్థలం ఉన్న వారి జాబితా, ఇళ్ల స్థలం కూడా లేని కుటుంబాల జాబితాలను వేరువేరుగా రూపొందించాలని సూచించారు.
ఇలా.. రూపొందించిన జాబితాలకు గ్రామ సభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు. దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్లో 274 మంది ఇంజనీర్లు మాత్రమే ఉన్నారని.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలైతే.. వీరు సరిపోరని అధికారులు వెల్లడించారు. పథకం అమలు మొదలైతే శాఖలోని పనుల పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజనీర్లు అవసరమని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇతర ప్రభుత్వ విభాగాలలో ఇంజనీరింగ్ సిబ్బంది సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఆలోచించాలని అధికారులకు మంత్రి పొంగులేటని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. విలేజీ రెవెన్యూ వ్యవస్ధకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఇందుకోసం వీఆర్వో, వీఆర్ఏ.. నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని, ఈ పరీక్షకు సంబంధించిన విధివిధానాలను తక్షణమే రూపొందించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read : ఎస్సీ, ఎస్టీల కోసం చేయాల్సినవి ఇవే.. భట్టి విక్రమార్కమాస్టర్ ప్లాన్..
రాష్ట్రంలో ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో.. 450 మంది సర్వేయర్లు ఉన్నారని తెలిపిన అధికారులు.. అదనంగా మరో వెయ్యి మంది సర్వేయర్లు అవసరమవుతారని వెల్లడించారు. సర్వేయర్ల ఎంపికకు కావలసిన ప్రణాళిక తయారు చేయాలని ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు. దీంతో.. త్వరలోనే.. సర్వేయర్ల ఉద్యోగాలు భర్తి చేసే అవకాశాలున్నాయి.