BRS : పిడికిలి మూసి ఉంచితే.. లోపల ఏముందోననే ఉత్కంఠ ఉంటుంది. పిడికిలి ఎప్పుడు ఓపెన్ చేస్తారా.. గుప్పిట ఏముందో చూద్దామా అనే టెన్షన్ కంటిన్యూ అవుతుంది. అదే, పిడికిలి తెరిచి చూపిస్తే.. ఇంకేముంది.. ఆ ఆసక్తి పోతుంది. ఇంతేనా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఆడే ఆట ఇది. వారికి సరదాగానే ఉండొచ్చు కానీ.. రాజకీయాల్లో మాత్రం ఈ గేమ్ సరదా తీర్చేస్తుంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ విషయంలో ఇలానే జరిగిందని అంటున్నారు విశ్లేషకులు.
అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం
ఏడాదిన్నర అవుతోంది. కేసీఆర్ ఫాంహౌజ్లోనే ఉంటున్నారు. బయటకు రావట్లేదు. అసెంబ్లీకి వెళ్లట్లేదు. మీడియాతో మాట్లాడట్లేదు. ప్రజలను కలవట్లేదు. దొర దొరే అన్నట్టు ఉంటున్నారు. గులాబీ బాస్ వ్యూహం ఎంటో ఎవరికీ అంతు చిక్కకుండా ఉండేది. కేసీఆర్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారంటూ కేటీఆర్, హరీష్లు తమదైన స్టైల్లో ఊదరగొట్టేవాళ్లు. మళ్లీ వచ్చేది గులాబీ పాలనే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయించేవాళ్లు. రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ.. సీఎంను మార్చేస్తారంటూ.. రాహుల్గాంధీతో గ్యాప్ ఉందంటూ.. ఏది తోస్తే అది జనాల మీదకు తోసేసేవాళ్లు.
బాస్ ఈజ్ బ్యాక్?
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై గులాబీ శ్రేణులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాయి. తీరా ఆ టైమ్ రానేవచ్చింది. గులాబీ బర్త్డేకు లక్షల్లో జనం వచ్చారు. అయితే, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు మారింది బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి అని అంటున్నారు. ఎన్నెన్నో అనుకున్నాం.. ఎంతెంతో ఊహించుకున్నాం.. చివరాఖరికి ఇలా పస లేకుండా పోయిందంటూ గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాత చింతకాయ పచ్చడి చప్పగా ఉందంటూ కొందరు.. పాత సీసాలో పాత సారానే అంటూ ఇంకొందరు.. కేసీఆర్ స్పీచ్పై సొంతపార్టీ కార్యకర్తలే డిసప్పాయింట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
బోర్ కొట్టిస్తున్న కేసీఆర్
తెలంగాణ తెచ్చింది నేనే.. కాంగ్రెస్సే విలన్.. మళ్లొచ్చేది మనమే.. ఇలా రొటీన్ డైలాగులతో కేసీఆర్ స్పీచ్ చప్పగా సాగిందంటున్నారు. రాకరాక బయటకు వస్తే.. ఈ టైమ్లో మాట్లాడాల్సిన మాటలా ఇవి? అంటున్నారు. కేసీఆర్ అంటే మాస్.. ఊర మాస్. అదే ఆయన బలం. ఇప్పుడా మాస్ పల్స్ మిస్ అయిందని చెబుతున్నారు. మునుపటి దూకుడు లేదంటున్నారు. పంచ్లు.. ప్రాసలు.. గాంభీర్యం గట్రా కనిపించలేదంటున్నారు. ఫిజికల్గా, మెంటల్గా వీక్గా కనిపించారని అంటున్నారు. మాటల మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ కాస్తా.. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఇదేం స్పీచ్రా బాబోయ్ అంటూ బోర్ కొట్టించే స్థాయికి పడిపోయారని అంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ప్రెస్మీట్ పెడితే గంటల తరబడి ఎంజాయ్ చేసే జనమే.. ఇప్పుడు అదే కేసీఆర్ రజతోత్సవ సభలో మాట్లాడుతుంటే.. ఛానెళ్లు మార్చేశారని చెబుతున్నారు. సోది మాటలు.. సొల్లు డైలాగులతో.. ఉన్న క్రేజ్ కాస్తా పోగొట్టుకున్నారని అంటున్నారు. కేసీఆర్ సభ తర్వాత.. ఇక తమకు ఢోకా లేదంటూ.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగినట్టు కనబడుతోంది. కేసీఆర్ ఫాంహౌజ్లోనే ఉండటం కంటే కూడా.. ఇలా అప్పుడప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సభ వల్ల మైలేజ్ కంటే.. డ్యామేజ్ ఎక్కువ జరిగిందని.. మీటింగ్ పెట్టకున్నా బాగుండేదనే.. గులాబీ గుంపులో గుసగుస నడుస్తోంది.
Also Read : మనోడు.. మందోడు.. రేవంత్ క్లియర్ కట్
కేసీఆర్ శకం ముగిసిందా?
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఇలాంటి కామెంట్లే చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీ బాటిల్సే ఎక్కువ ఉన్నాయన్నారు. సభలో అసలు మహిళలే కనిపించలేదన్నారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేదని.. ఆయన శకం ముగిసిందని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆడుతున్న మూడు ముక్కలాటతో కేసీఆర్కు మతి భ్రమించిందన్నారు. కుటుంబ కొట్లాటలతో వేగ లేకే.. రజతోత్సవ సభ పేరిట హంగామా చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వేదికపై కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీతో.. అల్లుడు హరీష్, కూతురు కవిత మనసుకి మరోసారి గాయమైందని చెప్పారు. చిలకా ఏ తోడు లేక అంటూ కవిత.. బభ్రాజమానం భజగోవిందంలా హరీష్ రావు పరిస్థితి మారిందన్నారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. బీజేపీపై కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటం చూస్తుంటే.. ఆ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడిందని చెప్పారు. కేసీఆర్ చేసిన విమర్శలు.. బీజేపీని నెమలి పిచ్చంతో కొట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు.