Ramchander Rao: సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల నియామకం కోసం తరలివచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తూ కొడుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద కాంగ్రెస్ అసలైన మొహబ్బత్ కీ దుకాణ్ బయటపడిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు. కాంగ్రెస్.. ఢిల్లీలో యువత కోసం మొసలి కన్నీరు కారుస్తోందని, కానీ తెలంగాణలో మాత్రం ఉపాధి కోసం వచ్చిన అమాయక నిరుద్యోగ యువతపై అదే పార్టీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పే మొహబ్బత్ కీ దుకాణ్ అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.
కేవలం 150 ఖాళీల కోసం అంత భారీ సంఖ్యలో యువతీ యువకులు తరలిరావడం అత్యంత ఆశ్చర్యకరమన్నారు. యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నిరుద్యోగ యువతకు ఎన్నో ఆకర్షణీయమైన హామీలిచ్చిందని, అధికార పీఠం దక్కగానే ప్రాధాన్యతా క్రమంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని, ప్రతినెల నిరుద్యోగ భృతితో పాటు యువతకు అన్ని విధాలా అండగా ఉంటామని గొప్పలు చెప్పిందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడిచినా, నేటికీ తెలంగాణ యువత ఉద్యోగాల కోసం రోడ్లపైనే నిరీక్షించాల్సి రావడం శోచనీయమన్నారు. నెలకు ఇస్తామన్న రూ.4,000 నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగని, కనీసం దాని ఊసేత్తడం లేదన్నారు.
Also Read: ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగానే డ్రైవర్కు ఫిట్స్.. స్పాట్లో ప్రయాణికులు..!
యువత స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఆర్నెళ్లలోనే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాల హామీలు కాంగ్రెస్ మార్క్ మోసానికి నిదర్శనంగా మిగిలిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రధాన హామీని పూర్తిగా విస్మరించి, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగావకాశాలు లేక యువత అల్లాడుతుంటే.. హైడ్రాలో కేవలం 150 ఉద్యోగ ఖాళీల ప్రకటన రాగానే వేలాది మంది నిరుద్యోగులు సరూర్ నగర్ స్టేడియానికి పరుగులు తీశారన్నారు. ఉపాధి కోసం వచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీలు ఝళిపించి, తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయన్నారు. తమ భవిష్యత్తు కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే అమాయక యువతపై పోలీసు బలగాలను, లాఠీలను ఎందుకు ఉపయోగిస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, యువతకు సమాధానం చెప్పాలని రాంచందర్ రావు ప్రశ్నించారు.
Also Read: జగన్ పర్యటనలో ఎస్సైపై దాడిచేసిన.. చింతాడ రవి అరెస్ట్!