Rangareddy District: ప్రజల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిందని పార్టీ రాష్ట్ర ఇంచార్జి నెమూరి శంకర్ గౌడ్(Nemuri Shankar Goud) స్పష్టం చేశారు. అధికార పార్టీల వైఫల్యాలకు ప్రత్యామ్నాయంగా జనసేన ప్రజల తరఫున గళం విప్పుతోందన్నారు. సోమవారం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో మేడ్చల్ జనసేన పార్టీ ఇంచార్జి పెద్ది రాజు(Peddi Raju) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నెమూరి శంకర్ గౌడ్ అభ్యర్థులకు బీ-ఫారమ్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన రాజకీయాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందని, మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు ప్రజల మద్దతు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలియాబాద్, ముడిచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా పోటీ చేస్తోందని తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏడుగురు, ముడిచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒకరు జనసేన అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో బరిలో ఉన్నారని చెప్పారు.
Also Read: IND vs PAK: పాకిస్తాన్ బాయ్ కాట్..అయినా శ్రీలంకకు టీమిండియా వెళ్లాల్సిందే? ఐసీసీ తలతిక్క రూల్స్
అలాగే ఉమ్మడి రంగారెడ్డి(Rangareddy) జిల్లా వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ తరఫున మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం, పార్టీ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీ లేకుండా పోరాడే పార్టీ జనసేన ఒక్కటేనని, ఈ ఎన్నికలు రాజకీయాల్లో మార్పుకు నాంది అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కోఆర్డినేటర్ రామ్ మోహన్, లలిత రాణి, మల్లికార్జున్ తదితర నాయకులు పాల్గొన్నారు.