Jana Sena: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలోనూ జన సేన విస్తరించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే పార్టీ యాక్టివిటీస్ ను మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 19న జన సేన తెలంగాణ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల పార్టీ కార్యకలాపాలు, సమన్వయ పనులను పర్యవేక్షించనున్నారు. అంతేగాక స్టేట్ బాడీ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతకంటే ముందు యూత్ వింగ్, వీర మహిళా, విద్యార్ధి విభాగాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో సరికొత్త వ్యూహాలతో, దూకుడుగా అడుగులు వేసేందుకు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన నేతలు, కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమాన యువత కొరిక మేరకు ఈ రాష్ట్రంలోనూ జనసేనను విస్తరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో పార్టీని ఒక విధానపరమైన దిశగా నడిపించేందుకు త్వరలోనే పూర్తిస్థాయి ‘రాష్ట్ర కార్యవర్గ కమిటీ’ని ప్రకటించనున్నారు. ఇప్పటివరకు కేవలం కొద్దిమంది ముఖ్య నేతలతో సాగిన పార్టీ వ్యవహారాలు, ఇకపై అధికారిక కమిటీ పర్యవేక్షణలో జరగనున్నాయి. తెలంగాణ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన, క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులకు ఈ కమిటీలో ప్రాధాన్యత దక్కనుంది.
జనసేన కేవలం పట్టణాలకో, సోషల్ మీడియాకో పరిమితం కాదనే సంకేతాన్ని ఇవ్వడానికి “గ్రామ స్థాయి” పర్యటనల వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ప్రతి పల్లెలో జనసేన జెండా ఎగిరేలా, స్థానిక సమస్యలపై పోరాటాలు చేసేలా గ్రామ, మండల కమిటీల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ రూపుదిద్దుకుంది.తెలంగాణలోని యువతను పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు మహిళా సాధికారత, స్థానిక సమస్యలపై పోరాడేలా మహిళా శ్రేణులను ఏకం చేయనున్నారు.
Also read: Indian Sailors: ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి!
విద్యార్ధి విభాగాలు ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలు, విద్యా రంగంలోని లోపాలపై ధ్వజ మెత్తేలా ప్రత్యేక కార్యచరణ సిద్ధం కానున్నది. ఇందుకోసం యువతను పెద్ద ఎత్తున మోటివేట్ చేసేందుకు పార్టీలోని కొంత మంది ముఖ్య నాయకులు రెడీ అయ్యారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, నిరుద్యోగ నిరసనలు, ప్రజా సమస్యలను టార్గెట్ చేస్తూ జనసేన ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది. ప్రజల పక్షాన నిలబడి నిలదీసే ప్రధాన శక్తులలో ఒకటిగా ఎదగడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పార్టీ శ్రేణులు వివరిస్తున్నారు.
తెలంగాణ విస్తరణలో అత్యంత కీలకమైన ఘట్టం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగబోతోంది. పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో పాటు రాజకీయంగా మద్దతుగా నిలిచే ఐదు రాష్ట్రాల స్పెషల్ ఫేవర్ టీమ్స్తో ఢిల్లీలో ఒక హై-లెవెల్ మీటింగ్ జరగనుంది.ఈ నెల 14 నుంచి 16 వరకు మీటింగ్ లు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి తెలంగాణ జనసేన ముఖ్య నేతలు, సమన్వయకర్తలు హాజరవుతున్నారు. వరుసగా మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక భేటీలో తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, పొత్తులు లేదా ఒంటరి పోరాటం వంటి కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
Also read: బాలయ్య సినిమాలో పవర్ఫుల్ విలన్గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!