Kadiyam Srihari: జనగామ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై, ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేటీఆర్కు బలుపు తగ్గలేదు.. కడియం ఆగ్రహం
బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. అధికారం కోల్పోయినా కేటీఆర్లో అహంకారం, బలుపు తగ్గలేదని మండిపడ్డారు. కనీస సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘కేటీఆర్ ప్రస్తుతం తీవ్ర ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఆ నిరాశలోనే ఇలాంటి సిగ్గుచేటు విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్లే ఆయన సొంత చెల్లెలు కూడా పార్టీని వీడాల్సి వచ్చింది.’ అని కడియం ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని, లేదంటే అదే రీతిలో తాము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణపై బీజేపీకి కక్ష, వివక్ష
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇష్టం లేదని కడియం శ్రీహరి ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదని, అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. తెలంగాణపై నిజంగా కక్ష, వివక్ష లేకపోతే.. ఇక్కడి ప్రాజెక్టులకు నిధులు తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఏదైనా ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రివా? గల్లీ కార్పొరేటర్వా?
కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ల తీరుపై కడియం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేని వీరు.. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసమే వీరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారా అనే అనుమానం కలుగుతోందన్నారు’. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిలా కాకుండా, గల్లీలో ఉండే కార్పొరేటర్లా మాట్లాడుతున్నారని, కాస్తయినా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
కాజీపేట రైల్వే డివిజన్ సాధించి చూపండి
కాజీపేటకు రైల్వే డివిజన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తెలంగాణపై కాస్తైనా ప్రేమ ఉంటే.. వెంటనే కాజీపేటను రైల్వే డివిజన్గా మార్చేలా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించాలని సవాల్ విసిరారు. చేతకాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి తప్ప.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేయవద్దంటూ కడియం శ్రీహరి ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read: రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!