Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తన మొక్కును చెల్లించుకునేందుకు ఆమె ఈసారి కాలినడకన తిరుమల కొండను ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన వివరాలు వెల్లడయ్యాయి. కల్వకుంట్ల కవిత ఈ నెల 5వ తేదీన తిరుపతికి చేరుకుంటారు. అదే రోజున ఆమె అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. కొండపైకి చేరుకున్న అనంతరం, మరుసటి రోజు అంటే ఈ నెల 6వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. స్వామి వారి దర్శనం అనంతరం తన మొక్కులు చెల్లించుకుంటారు.
సుదీర్ఘ కాలం పాటు తనను వెంటాడిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చివరకు క్లీన్ చీట్ రావడంతో, శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆమె ఈ యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ పర్యటన కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదని, దీని వెనుక బలమైన రాజకీయ కారణం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 6వ తేదీన స్వామివారి దర్శనం అనంతరం కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ‘తెలంగాణ జాగృతి’ ద్వారా ప్రజల్లో ఉన్న ఆమె, ఇప్పుడు నేరుగా రాజకీయ పార్టీగా మారేందుకు సంకేతాలు అందుతున్నాయి.
ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీయనున్నాయి. లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటం ఆమెకు పెద్ద ఊరటనివ్వగా, కొత్త పార్టీ ప్రకటన ద్వారా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను స్పష్టం చేయాలని ఆమె భావిస్తున్నట్లు అనుచరవర్గం భావిస్తోంది.
Read Also: Kalvakuntla Kavitha: ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం.. గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్