తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నం.317 కారణంగా వేలాది మంది ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆమె ఈ లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తక్షణమే ఉద్యోగులకు న్యాయం చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
నాడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ…..
2021 డిసెంబర్ 6వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో నం.317ను తీసుకువచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఈ జీవో వల్ల ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు దూరమై మానసిక వేదన అనుభవిస్తున్నారని అప్పట్లో మీరు కేసీఆర్కు లేఖ రాశారని సీఎంకు లేఖలో గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చారని ఆమె వివరించారు.
సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్..
ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు నాయకులు కూడా గతంలో ఈ జీవో బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారని కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగ ఉపాధ్యాయులను వారి స్థానికత ఆధారంగా స్వస్థలాలకు బదిలీ చేసేలా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
నిబంధనల్లో మార్పులు అవసరం..: కల్వకుంట్ల కవిత
స్థానికతను గుర్తించే ప్రస్తుత నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయాలని కవిత డిమాండ్ చేశారు. వేల కుటుంబాలు ఈ విధానం వల్ల విడిపోయాయని ప్రాధాన్యత క్రమంలో వారందరికీ ఊరట కలిగించాలని విన్నవించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు.