Kavitha New Party: త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. తనకు సెంటిమెంట్ ఎక్కువ అన్న కవిత.. మంచి ముహోర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. కొత్త పార్టీ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. మూడు నెలల్లోనే పార్టీ ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) గుర్తిస్తే తాను లీడర్ ను కానని.. ప్రజలు చేస్తే తాను లీడర్ ను అవుతానని చిట్ చాట్ లో కవిత అన్నారు. కేసీఆర్ (KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ భవన్ (Telangana Bhavan)కే పరిమితం అయిందని విమర్శించారు. గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతుందో చూసుకోవడం లేదని ఆరోపించారు. ఇంకొంత కాలం గడిస్తే తన బలం ఏంటో అందరికీ తెలుస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.
త్వరలోనే జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి కవిత సూటి ప్రశ్నలు వేశారు. పురపోరు కోసం కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao)లు రాష్ట్రం అంతటా ఎందుకు ప్రచారం చేయటం లేదని నిలదీశారు. కేటీఆర్, హరీష్ లు రాష్ట్ర నాయకులు కాదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ సిరిసిల్లకే ఎందుకు పరిమితం అయ్యారని కవిత నిలదీశారు. సిరిసిల్లలో 16 మంది బీఆర్ఎస్ వాళ్లు టికెట్ కోసం తమని కలిసినట్లు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు జాగృతి పోటీ చేస్తున్న ప్రాంతాల్లోనే హరీష్ రావు తిరుగుతున్నారని కవిత ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులు ఇతర జిల్లాల్లో ఎందుకు తిరగటం లేదన్నారు. ‘గుంట నక్క, గూఢాచారి పేర్లు ఆయా వ్యక్తులకు సూటబుల్ కాబట్టే పిలుస్తున్నాను’ అని కవిత ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు జీవన్ రెడ్డి (Jeevan Reddy)ని సస్పెండ్ చేసే దమ్ము కాంగ్రెస్ (Congress Party)కు ఉందా? అంటూ కవిత ఫైర్ అయ్యారు. ‘జగిత్యాలలో జీవన్ రెడ్డి చాలా బలమైన నాయకుడు. అప్పట్లో జీవన్ రెడ్డిని ఓడించటానికి మేము చాలా కష్ట పడ్డాం. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నేత జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతారని నేను అనుకోవడం లేదు’ అని కవిత చెప్పుకొచ్చారు.