కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటూనే ఉన్నారు. తాజా కలలో ఆయనకు BRS సిల్వర్ జూబ్లీ సభ తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని తెలిసిందట. ఆ విషయాన్నే ఆయన పార్టీ నేతల మీటింగ్ లో వివరించారు. ఈనెల 27 వరంగల్ లో నిర్వహించే బహిరంగ సభతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఉపదేశించారు కేసీఆర్. తెలంగాణ తెచ్చిన BRS పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తేడా ఎంటో ప్రజలు తెలుసుకున్నారని కూడా సెలవిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటే రాబోయే రోజుల్లో BRS గెలుపు నల్లేరుపై నడక అవుతుందన్నారు. ఈనెల 27న జరగబోయేది BRS బహిరంగ సభ కాదని, తెలంగాణ బాగు కోసం నిర్వహించే సభ అని కొన్ని పంచ్ లైన్లు కూడా ప్రయోగించారు.
ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సమావేశమయ్యారు. pic.twitter.com/AYApzisXBO
— BRS Party (@BRSparty) April 1, 2025
జనంలో లేకే ఓటమి..
BRS నేతల్ని నిత్యం జనంలో ఉండాలని చెబుతున్న కేసీఆర్, గతంలో తాము జనంలో లేకే ఓడిపోయామనే విషయాన్ని ఒప్పుకున్నట్టయింది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడంతో కేసీఆర్ కి కళ్లు నెత్తికెక్కాయని ఆ పార్టీ నేతలే అనుకునే పరిస్థితి. కనీసం కేబినెట్ కూడా లేకుండా తానే రాజు, తానే మంత్రి అన్నట్టుగా కొన్నాళ్లు అధికారం వెలగబెట్టారు. ఆ తర్వాత కిచెన్ కేబినెట్ లాగా.. మంత్రులకు అధికారాలు లేకుండా చేసి అన్నీ తానే అయ్యారు. షాడో సీఎంగా కేటీఆర్ అధికారాన్ని చెలాయిస్తే, కుటుంబ సభ్యులు మరింతగా అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టారు. చివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకెళ్తేగాని కేసీఆర్ ఫ్యామిలీ దందా ఏ రేంజ్ లో సాగిందో అందరికీ అర్థమైంది.
రేవంత్ దెబ్బ అదుర్స్..
జనం వద్దు ధనం కావాలి అనుకున్నప్పుడే కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అయితే ఐదేళ్లలోనే జరగాాల్సింది కాస్త ఆలస్యంగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ కి ఏం చేయాలో తోచడంలేదు. అందులోనూ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక, కేసీఆర్-కేటీఆర్ సహా బీఆర్ఎస్ కి ఊపిరాడనివ్వడంలేదు. అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయట.. సీఎం రేవంత్ రెడ్డి ధాటిని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. కాంగ్రెస్ లో లుకలుకలు పెట్టాలని చూసినా సాధ్యం కావడంలేదు. దీంతో చివరికి జనాలవద్దకే వెళ్తామంటూ కబుర్లు చెబుతున్నారు కేసీఆర్.
6 గంటలసేపు మీటింగ్..
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీ పెట్టి పాతికేళ్లవుతోంది. ఈ టైమ్ లో పార్టీ అధికారంలో ఉంటే ఆ క్రేజే వేరు. కానీ చేసిన తప్పులకు బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ శిక్ష అనుభవిస్తోంది. ఇలాంటి టైమ్ లో ప్రతిపక్షానికే పరిమితమైంది. అయినా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరపాలనుకుంటున్నారు కేసీఆర్. కానీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం లేదు. తాజాగా ఫామ్ హౌస్ లో మీటింగ్ జరిగినా నాయకుల్లో స్పందన లేదు కానీ, కేసీఆర్ మాత్రం వారినుంచి చాలా ఎక్కువ ఆశిస్తుండటం విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. దాదాపు 6 గంటల సేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలన్నారు. లక్షలాది మందితో వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేయాలని చెప్పారు.
జన సమీకరణ సరే..
నియోజకవర్గం నుంచి లక్ష మంది, లక్షలాదిమందితో వరంగల్ సభ.. వినడానికి బాగానే ఉన్నా దీనివల్ల ప్రయోజనం ఏంటనేది అసలు ప్రశ్న. గత ఎన్నికల ముందు కూడా కేసీఆర్ హెలికాప్టర్ లో తెలంగాణ చుట్టూ రౌండ్ వేశారు. బహిరంగ సభల పేరుతో బీఆర్ఎస్ భారీగా జనసమీకరణ చేసింది. ఆ జనాన్ని చూసి మీడియా కూడా కేసీఆర్ గెలుపు ఖాయం అనుకుంది. సీన్ కట్ చేస్తే గులాబి దళపతికి ఘోర పరాభవం ఎదురైంది. స్వయానా రెండు చోట్ల పోటీ చేసిన కేసీఆర్ ఒకచోట ఓడిపోయారు. జనం విలువ తెలుసుకోలేదు కాబట్టే ఆయనకి ఓటమి ఎదురైంది. ఇకనైనా కుటుంబాన్ని పక్కనపెట్టి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తే, బీఆర్ఎస్ గురించి జనం ఆలోచించే అవకాశం ఉంది. అహంకారాన్ని పక్కనపెట్టకపోతే మాత్రం ఎన్ని సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసినా ఉపయోగం ఉండదు.