KCR comments on PM Modi(Political news in telangana): ఎన్నికల వేళ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం సహజం. ఓటర్లను ఆకట్టుకునేందుకు లేనిపోని కామెంట్స్ చేస్తారు. ఈ జాబితాలో ముందు ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కేసీఆర్ కొత్త పాచిక వేశారు. తనను అరెస్టు చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నుతోందన్నది కేసీఆర్ ప్రధాన ఆరోపణ.
ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు కేసీఆర్. ఇంతకీ కేసీఆర్ను అరెస్టు చేయాల్సిన పరిస్థితి మోదీ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? కేసీఆర్ మాటల్లో నిజముందా? లేక ఓటర్లను ఆకట్టుకునేందు కే ఆరోపణలా? ఇలా రకరకాల ప్రశ్నలు గులాబీ శ్రేణులను వెంటాడుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలామందిని అరెస్ట్ చేశాయి. ఇప్పటికీ చాలామంది జైలులోనే ఉన్నారు. అందులో కీలకమైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ కూతురు కవిత కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి లొంగకుండా ఉన్న వ్యక్తుల్లో దేశంలో నలుగురు ఉన్నారని చెప్పుకొచ్చారు గులాజీ పార్టీ అధినేత కేసీఆర్. అందులో తను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. మరొకరు ఎవరన్నది ఆయన ప్రస్తావించలేదు. వాళ్లని అరెస్ట్ చేశారని, తాను ఎక్కడా అవినీతికి పాల్పడ లేదని, అందుకే మోదీ సర్కార్కు దొరకలేదన్నారు.
మరి కేసీఆర్ మాటల్లో ఏమైనా నిజముందా? అనే దానిపై ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలు చర్చించుకోవడం మొదలైంది. అవినీతికి కేసీఆర్ దూరమని అంటున్నారు. ఆయన చాలా నిజాయితీ గల నేత అని కమలనాధులు సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనను చూసిన ప్రజలు, ఇలాంటి పాచికలు వేయడంలో ఆయన మహా దిట్ట అని అంటున్నారు. కేసీఆర్ అబద్దాల గురించి అందరికీ తెలుసని, నిజాలు ఎప్పుడూ చెప్పరని అంటున్నవాళ్లూ లేకపోలేదు. కాకపోతే కేసీఆర్ పాచికకు సమయం అయిపోయిందని, ఇప్పుడు ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మరని అంటున్నారు.
ALSO READ: నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్న జస్టిస్ చంద్రఘోష్
పనిలోపనిగా తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఇష్యూతో తమకేం సంబంధంలేదన్నారు. అధికార ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం అత్యంత సహజమన్నారు. అసలది ఆరోపణే కాదని ఒక్కముక్కలో తేల్చేశారు. మొత్తానికి తనకు తానే క్లీన్చిట్ ఇచ్చేసుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్.