⦿ చుట్టుముట్టిన ‘లొట్టపీసు’
⦿ ఏసీబీ కేసుపై నాడు యథేచ్ఛగా పోలికలు
⦿ విచారణకు భయపడేది లేదని నాడు వ్యాఖ్య
⦿ జైల్లో యోగా చేసి స్లిమ్ అవుతానని గాంభీర్యం
⦿ ఇప్పుడు అరెస్టు తప్పించుకునే ప్రయత్నాలు
⦿ అందుకోసమే హైకోర్టులో క్వాష్ పిటిషన్
⦿ హైకోర్టు కొట్టేయడంతో లీగల్ మార్గాన్వేషణ
⦿ తీర్పును సవాలు చేస్తూ ‘సుప్రీం’లో పిటిషన్
⦿ ఈడీ, ఏసీబీ విచారణ పరిణామాలపై గుబులు
⦿ అరెస్టు తప్పదనే భావన.. నేతల పరామర్శలు
⦿ అరెస్టు చేస్తే ఆందోళనకు శ్రేణుల సమాయత్తం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :
KTR: ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో తదుపరి కార్యాచరణపై కేటీఆర్కు గుబులు పట్టుకున్నది. ఏసీబీ అరెస్టు చేస్తుందా?.. అది రికార్డు చేసే స్టేట్మెంట్లో ఏం చెప్పాలి?.. ఆధారాలను కండ్ల ముందు పెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేస్తే కమిట్ అవ్వాల్సి వస్తుందా?.. అధికారులు ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా ఇబ్బందుల్లో పడక తప్పదా? చివరకు అది అరెస్టు వరకూ దారితీస్తుందా? పొలిటికల్గా డ్యామేజ్ కలుగుతుందా? ఢిల్లీ లిక్కర్ కేసులో చెల్లెలు కవిత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాతి పరిస్థితులే తనకూ రిపీట్ అవుతాయా? ఇలాంటివన్నీ ఇప్పుడు కేటీఆర్ను కలచివేస్తున్నాయని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. పైకి ‘లొట్టపీసు’ కేసు అని చెప్తున్నా అదే ఇప్పుడు ఆయనను అరెస్టు చేసేదాకా వెళ్తుందనే వాతావరణం నెలకొన్నది. పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్లతో ఆయనలో గుబులు మొదలైనట్లు సమాచారం.
లాయర్లతో భేటీ.. సుప్రీంలో పిటిషన్
అరెస్టు వరకూ వెళ్ళకుండా ఉన్న లీగల్ చర్యలపైనే ఇప్పుడు కేటీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తున్నది. అందులో భాగంగానే.. హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే సీనియర్ లాయర్లతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనే నిర్ణయం. కేసులకు, అరెస్టుకు భయపడే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో మీడియాతో వ్యాఖ్యానించినా ఇప్పుడు మాత్రం అరెస్టు కాకుండా ఉన్న దారులవైపు ఆలోచిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు రానంతవరకూ కవితకు పార్టీలో ప్రయారిటీ, శ్రేణుల నుంచి గౌరవం, ఆదరణ ఉన్నాయని, సీబీఐ, ఈడీ ఎంక్వయిరీలకు హాజరై ఐదున్నర నెలల పాటు తీహార్ జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఆ మచ్చ అలాగే మిగిలిపోయిందనేది కేటీఆర్కు తెలియందేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో సైతం తనకు ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయేమోననే ఆందోళన కేటీఆర్ను పట్టిపీడిస్తున్నదని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు.
నాడు అలా.. నేడు ఇలా… :
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు తనను ఏమీ చేయలేదంటూ మీడియా ముందు కేటీఆర్ గంభీర ప్రకటనలు చేస్తున్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయనను ఒకింత ఆందోళనకు గురిచేసేదనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ సమయంలోనైనా అరెస్టు చేయవచ్చనే అంచనాతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ఇంటికి పరామర్శల క్యూ కట్టినట్టు కనిపిస్తున్నది.
లొట్టపీసు కేసు, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసు అంటూ మీడియాతో వ్యాఖ్యానించినా ఇప్పుడు అదే కేసు అరెస్టు దాకా తీసుకెళ్తుందనే గుబులు నేతల్లో కూడా కనిపిస్తున్నది. అరెస్టు చేస్తే జైల్లో హాయిగా రోజూ యోగా చేస్తూ స్లిమ్గా తయారవుతానని, భవిష్యత్తులో పాదయాత్రకు ఫిట్గా మారుతానని నాడు కామెంట్ చేయగా.. హైకోర్టు తుది తీర్పు వెలువరించే సమయంలో మాత్రం అరెస్టు కాకుండా మినహాయింపు ఇవ్వాలని, గడువు పొడిగించాలని రిక్వెస్టు చేయడం ఆయన పడుతున్న ఆందోళనకు నిదర్శనమనే మాటలూ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
ఏసీబీ, ఈడీ ఎంక్వయిరీల భయం
ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు తప్పదని తేలిపోవడంతో దాన్ని ఎదుర్కోవడంపై కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఏసీబీ కొన్ని అంశాలను నమోదు చేయగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ స్టేట్మెంట్ను కూడా ఏసీబీ రికార్డు చేసింది. గత ప్రభుత్వంలో ఆ శాఖ బాధ్యతలు చూసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇప్పటికే చాలా అంశాలను వెల్లడించారు. మంత్రి స్థాయిలో కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతోనే హెచ్ఎండీఏ ద్వారా విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు.
ఒక మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నానని మీడియాతో వ్యాఖ్యానించిన కేటీఆర్.. కోర్టులో వాదనలు జరిగే సమయంలో మాత్రం ప్రొసీజర్కు సంబంధించిన విషయాలను అధికారులు చూసుకోవాల్సిన అంశమని, మంత్రిగా తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పరస్పర భిన్నమైన అంశాలను ఏసీబీ, ఈడీ అధికారులు విచారణ సందర్భంగా ప్రస్తావిస్తే ఇవ్వాల్సిన సమాధానం కీలకంగా మారింది.
Also Read: KTR Press Meet: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఈ 16న ED విచారణ.. అసలేం జరగబోతుందంటే..?
కేసీఆర్ ఫ్యామిలీలో సెకండ్ అరెస్టు ! :
తెలంగాణ మేలు కోసం కడుపు కట్టుకుని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామని కేసీఆర్ అనేక మార్లు వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన ఆ కుటుంబం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓపెన్గానే కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు, జైలు జీవితం ఆ ఫ్యామిలీలో మొదటిది. ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ కేసులో సైతం అరెస్టు తప్పదని కేటీఆర్ ఒక అంచనాకు వచ్చారు. ఆయన అనుకున్న ప్రకారం అదే జరిగితే ఆ ఫ్యామిలీలో ఇది సెకండ్ అరెస్టు కానున్నది.