Peddi Statue Controversy: తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నర్సంపేట గడ్డపై పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని.. అందుకే పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ మెప్పు కోసం పోలీసులు దొంగల్లా రాత్రికి రాత్రే వ్యవహరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకోవద్దని, చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని కేటీఆర్ హితవు పలికారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. విగ్రహాన్ని తొలగించడమే కాకుండా తెల్లారేసరికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. ఇది ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ పాలనను గుర్తుకు తెస్తోందని మండిపడ్డారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడం సరైన పద్ధతి కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: చెట్టుకు కట్టేసి కొట్టండి.. తన్ని తరమండి.. మంత్రగాళ్లను వదలొద్దు.. పళ్లు రాలగొట్టండి..!
పెద్ది విగ్రహం తొలగింపు వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరినీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను విగ్రహ తొలగింపు వంటి తుగ్లక్ చేష్టలతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదని సూచించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేటీఆర్.. అప్పుడు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్రెడ్డి పేరు పెడతామని హామీ ఇచ్చారు.
Also Read: ఇతనేం సీఎం అయ్యా.. పొద్దున్నే 4 గంటలకు లేపేస్తున్నాడు.. విజయ్ రూటే సెపరేటు!